ASBL NSL Infratech

ఘనంగా ముగిసిన ‘ఆటా’ వేడుకలు

ఘనంగా ముగిసిన ‘ఆటా’ వేడుకలు

కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రుల హాజరు మధ్య నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు అవార్డు ప్రదానం

అమెరికా తెలుగు సంఘం (ఆటా) తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఆటా వేడుకల్లో భాగంగా చివరిరోజున గ్రాండ్‌ ఫైనల్‌ వేడుకలను హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌ బాబు, మాజీ మంత్రి హరీశ్‌ రావు, భాజపా నేత లక్ష్మణ్‌, అతిథులుగా ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, పైడి రాకేష్‌ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీనటుడు రాజేంద్రప్రసాద్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందించారు.

ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ఆటా వేడుకల చైర్‌, ఎలెక్ట్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ చల్లా, ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల, కాన్ఫరెన్స్‌ కన్వినర్‌ కిరణ్‌ రెడ్డి పాశం, కో ఆర్డినేటర్‌ సాయి సూదిని,ఆటా  ఆటా కోశాధికారి సతీష్‌ రెడ్డి, ఆటా జాయింట్‌ ట్రెజరర్‌ రవీందర్‌ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్‌ ఈశ్వర్‌ బండా, పాస్ట్‌ ప్రెసిడెంట్‌ కరుణాకర్‌ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ నరసింహారెడ్డి ద్యాసాని,కిషోర్‌ గూడూరు కాశీ కొత్త, రఘువీర్‌ మరిపెద్ది, రాజ్‌ కక్కెర్ల, ఆటా ఇండియా కో ఆర్డినేటర్‌ అమృత్‌ ముళ్ళపూడి, సినీ నటుడు, కల్చరల్‌ అడ్వైజరీ లోహిత్‌, కో ఆర్డినేటర్‌ శశికాంత్‌, పాస్ట్‌ ప్రెసిడెంట్‌ పరమేష్‌ భీమ్‌ రెడ్డి, కరుణాకర్‌ ఆసిరెడ్డి, తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ, అమెరికా తెలుగు కమ్యూనిటీకి ఎంతో సేవ చేస్తున్న ఆటా సంస్థ తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవలందించడం అభినందనీయమన్నారు. అమెరికాలో స్థిరపడిన ఎన్నారైలు తాము పుట్టి పెరిగిన తెలుగు రాష్ట్రాల్లో తమ ప్రాంతాల్లో సేవ చెయ్యడం గొప్ప విషయమని అంటూ, ఎన్నారైలు తోడ్పాటు అందిస్తే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నారైలు తమవంతు బాధ్యతగా సహకరించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, వైద్య రంగంలో కూడా దేశం మంచి స్థానంలో నేడు ఉందని చెప్పారు. విదేశాల నుండి కూడా పేషంట్స్‌ వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నారైలు దేశానికి పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. యువత ద్వారా దేశం ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ, ఆటా సేవలు ప్రశంసనీయమని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిందని, ఎన్నారైలు తమవంతుగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించి రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడ వున్నా మన ప్రాంతాన్ని మరచిపోవద్దని అంటూ, 20 రోజులుగా ఆటా సేవలు చూస్తూ వచ్చానని, అందరూ తమ తమ ప్రాంతాల్లో మంచి మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. మార్చిలోపు ఎన్నారై వెల్ఫేర్‌ బోర్డ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మాజీ మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ, ఆటా వాళ్ళు వారి సేవ కార్యక్రమాలను నల్లమల ప్రాంతాలకు కూడా తీసుకువెళ్ళారు. అంత దూరం వెళ్ళారు అంటే వాళ్లకు మన ప్రాంతం మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందన్నారు. 

వారికి నా అభినందనలు ధన్యవాదాలు. 33 ఏళ్లుగా ఆటా సంస్థ తెలుగు సంస్కృతికి, సాహిత్యానికి సేవ చేయడం ఒక ఎత్తు, ప్రజా సంక్షేమానికి పాటుపడడం మరో ఎత్తు, ఆటా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల10 నుంచి 30వ తేదీ వరకు 20 రోజుల పాటు ఆటా వేడకల్లో భాగంగా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించిందన్నారు. బిజినెస్‌, ఎడ్యుకేషన్‌ సెమినార్లు, విద్యార్థులకు వీసాలపై అవగాహన, స్కాలర్‌ షిప్పులు, స్కూళ్లలో కంప్యూటర్లు, డిజిటల్‌ సామగ్రి, పేదలకు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమన్నారు.  మన దేశ కీర్తిని ఆటా ప్రపంచ వ్యాప్తంగా చేస్తుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, పైడి రాకేష్‌ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు కూడా వారి సందేశాన్ని వినిపించారు. 

ఈ సందర్భంగా ఆటా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డప్పు విన్యాసాలు, జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబించే డ్యాన్స్‌లు, సంప్రదాయ నృత్య విన్యాసాలతో కళాకారులు మైమరపింపజేశారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఈ వేడుకల్లో తలమానికంగా నిలిచింది. పలువురు నిష్ణాతులకు, స్పాన్సర్లకు ఆటా అవార్డులను అందజేసింది. 

 

Click here for Event Gallery

 

 

 

Tags :