ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అహో అనిపించేలా ఆటా వేడుకలు

అహో అనిపించేలా ఆటా వేడుకలు

అమెరికా తెలుగు సంఘం (ఆటా) వాషింగ్టన్‌డీసిలోని వాల్టర్‌ ఇ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్న 17వ ఆటా మహసభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నభూతో నభవిష్యతి అన్న విధంగా ఆటా వేడుకలు చేసేందుకు ఆటా అధ్యక్షుడు భువనేష్‌ బుజాలా, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ సుధీర్‌ బండారుతోపాటు ఇతర ముఖ్య నాయకులు అన్నీ ఏర్పాట్లను చేశారు. ఆటా మహాసభలకు సినీరంగంలో అగ్రశ్రేణి సంగీత దర్శకుడైన ఇళయరాజా హాజరవుతున్నారు. మరోవైపు నేటితరాన్ని ఆకట్టుకున్న మరో సంగీత దర్శకుడు తమన్‌  కూడా ఈ మహాసభల్లో పాల్గొంటున్నారు. ఇళయరాజా సంగీత కచేరి, మరోవైపు తమన్‌ సంగీత విభావరి ఆటా కాన్ఫరెన్స్‌కే హైలైట్‌గా నిలవనున్నాయి. మరోవైపు తనపాటలతో అలరిస్తున్న రామ్‌ మిరియాల మ్యూజికల్‌ షో కూడా ప్రత్యేకంగా నిలవనున్నది. దాంతోపాటు ఎన్నో కార్యక్రమాలను ఆటా ఏర్పాటు చేసింది. అందరికీ నచ్చేలా మెచ్చేలా ఉన్న ఈ కార్యక్రమాలను తిలకించేందుకు ఇప్పటికే  చాలామంది టిక్కెట్లను బుక్‌ చేసుకున్నారు. ఈ వేడుకల్లో ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గి వాసుదేవ్‌ ప్రత్యేక ఉపన్యాసం, మీట్‌ అండ్‌ గ్రీట్‌ కూడా ఉంటుందని ఆటా నాయకులు తెలిపారు.

అమెరికన్‌ తెలుగు అసొసియేషన్‌ (ఆటా) నిర్వహించే మూడురోజుల వేడుకకు అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్‌ ఈ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ముస్తాబైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఏ రోజుకారోజు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. అమెరికన్‌ తెలుగు అసొసియేషన్‌ అధ్యక్షుడు భువనేష్‌ భుజాల సారథ్యంలో వేర్వేరు కమిటీలు వేడుకలకు సంబంధించి వేగంగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శనల వరకు, అవార్డుల నుంచి హాస్పిటాలిటీ వరకు, స్వాగతాల నుంచి భోజనాల వరకు ఇలా..అన్నీ ఏర్పాట్లను కాన్ఫరెన్స్‌ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. దాదాపు 75 కమిటీలు, 350 మందికిపైగా సభ్యులు అలుపెరుగకుండా ఈ ఏర్పాట్లను ప్రణాళిక ప్రకారం చేశారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా మూడు రోజుల్లో వేటికవే వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించారు. ఈ వేడుకలకు అమెరికా నలుమూలలా ఉన్న తెలుగువారితోపాటు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార, అధికార ప్రముఖులు హాజరవుతున్నారు.

మూడేళ్లుగా కరోనా పరిస్థితుల వల్ల అమెరికాలో పెద్ద తెలుగు వేడుక ఏదీ జరగకపోవడం, సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఈ వేడుకలు తెలుగువారంతా కలుసుకునే వేదికగా ఉండటంతో చాలామంది ఈ వేడుకలకు హాజరయ్యేందుకు ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. దానికి తోడు తమ తమ అభిమాన తారాగణం, ఇళయరాజా, తమన్‌, రామ్‌ మిరియాల సంగీత విభావరులు ఇతర కార్యక్రమాలను చూడాలన్న ఉత్సాహంతో వేలాదిమంది ఇప్పటికే వాషింగ్టన్‌ డీసి చేరుకున్నారు. 

వాషింగ్టన్‌ డీసీ వేదికగా జరగబోతున్న 17వ అమెరికన్‌ తెలుగు అసొసియేషన్‌  మహాసభలు ఘనంగా జరగనున్నాయి.  ఈ మేరకు తన వేడుకలకు రంగం చేసింది. మొత్తం మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఏ రోజు ప్రత్యేకత దానికే ఉంది. దీంతోపాటు ప్రత్యేక స్టాళ్ళు...ఫుడ్‌ సెంటర్లను కూడా ఆహుతుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఆటా నిర్వహిస్తున్న ఈ మహాసభలకు వచ్చిన అతిథులు.. ఎప్పటికీ మరిచిపోలేని విధంగా వేడుకలను డిజైన్‌ చేశారు. ఒకే వేదికపై అభివృద్ధి, సంస్కృతి, కళలు, ప్రజా సంబంధాలు, సెమినార్లు, వివాహా వేదికలు, మాటా ముచ్చట్లు.. ఇలా మూడు రోజులు వాషింగ్టన్‌ డిసిలో పండగ వాతావరణం కనిపించేలా కార్యక్రమాలు ఉన్నాయి.

జూలై 1

శుక్రవారం, జూలై1న బాంక్వెట్‌ నైట్‌తో ఆటా మహాసభల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అమెరికాలో భారత రాయబారిగా ఉన్న తరుణ్‌జిత్‌ సింగ్‌ సంధు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా, వాషింగ్టన్‌ డీసి మేయర్‌ మురళీ బౌసర్‌ గౌరవ అతిధిగా హాజరవుతున్నారు. వీరితోపాటు అనేక మంది ప్రముఖులు కూడా బాంక్వెట్‌ డిన్నర్‌కు వస్తున్నారు.

సాయంత్రం 6 నుంచి 11 వరకు బాంక్వెట్‌ నైట్‌ కార్యక్రమాలు జరుగుతాయి. గణేశ స్తుతితో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 75 సంవత్సరాల స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వందేమాతరం పేరుతో దేశభక్తిని పెంపొందించేలా ఇండియా నుంచి వచ్చిన కళాకారులతో ప్రదర్శన జరుగుతుంది. గాయని సునీత వ్యాఖ్యాతగా, గాయకులు రామ్‌ మిర్యాల, మంగ్లీల గానాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.  14 రంగాల్లో విశేష ప్రతిభ చాటిన వారికి ఆటా అవార్డులను కూడా ఈ కార్యక్రమంలోనే బహుకరించనున్నారు. సెలబ్రిటీలను పరిచయం చేయడంతోపాటు వారిని గౌరవించనున్నారు. బాంక్వెట్‌ డిన్నర్‌ తరువాత దాతల సత్కారం, గోల్ఫ్‌ విజేతలకు అవార్డుల బహుకరణ వంటివి ఉంటాయి.

  బాంకెట్‌ వేడుకల్లో సింగర్‌ రామ్‌ మిరియాల స్పెషల్‌ మ్యూజిక్‌ నైట్‌తో అలరించబోతున్నారు.

జులై 2

ఉదయం నుంచే ఆటా పరేడ్‌ ప్రారంభం అవుతుంది. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. కన్వెన్షన్‌ సెంటర్‌లోని గ్రాండ్‌ లాబీలో వెల్‌కం రిసెప్షన్‌తో  వేడుకలు ప్రారంభమవుతాయి. తెలుగే మన వెలుగు...తెలుగు మన గురువు పేరుతో ఆటా వారి ప్రారంభ నృత్యరూపకం జరుగుతుంది. ప్రముఖ గేయరచయిత చంద్రబోస్‌ స్వరపరిచిన ప్రారంభోత్సవ గీతాన్ని గాయకులు కొమాండూరి రామాచారి ఆలపిస్తారు. దాతల సత్కారం, అధ్యక్షుల ప్రసంగం వంటివి జరుగుతాయి. ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, యోగా గురు పద్మ విభూషణ్‌ సద్గురు జగ్గీ వాసుదేవన్‌ అతిథులతో మాట్లాడనున్నారు. అలాగే ఆటా కన్వెన్షన్‌లో భాగంగా హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ రామచంద్ర మిషన్‌ వేడుకలు నిర్వహించనున్నారు. చిన్నారుల కోసం ప్రత్యేక రూమ్‌లో వారికి అవసర మైన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. హార్ట్‌ఫుల్‌ నెస్‌ దాజి ప్రసంగం, కార్యక్రమా లు, బిజినెస్‌ ఫోరం ఆధ్వర్యంలో ప్రముఖు లతో సమావేశం, రaుమ్మంది నాదం ఫైనల్స్‌ పోటీలు, టిక్‌టాక్‌ షార్ట్‌ ఫిలింస్‌ ప్రదర్శన, ఆటా అందాల పోటీలు ఫైనల్స్‌, సయ్యంది పాదం ఫైనల్స్‌ పోటీలు, ఎన్నారై ప్యానల్‌ తరపున చర్చా కార్యక్రమాలు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రముఖులతో చర్చా కార్యక్రమం, తెలంగాణ మంత్రులు, ఆంధ్ర మంత్రులతో సమావేశం, ఉమెన్స్‌ ఫోరం తరపున మహిళలతో చర్చా గోష్టులు, ఇతర కార్యక్రమాలు, అలూమ్ని ఫోరం ఆధ్వర్యంలో పాత మిత్రుల కలయిక కార్యక్రమం వంటివి జరుగుతుంది.  కవి జొన్నవిత్తుల పేరడి, సినిమా కథలు అప్పుడు ఇప్పుడు వంటి కార్యక్రమాలను ఈ సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేశారు. యుఎస్‌ పొలిటికల్‌ ఫోరం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. సీనియర్‌ సిటిజెన్స్‌ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పుట్టినరోజు వేడుకలను కూడా నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా తనికెళ్ళ భరణితో ఆధ్యాత్మిక ప్రసంగం, కిరణ్‌ చుక్కపల్లితో హిమాలయన్‌ యోగ కార్యక్రమం ఉంటుంది. డాక్టర్‌ ఖాదరవలితో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కార్యక్రమం జరుగుతుంది. లీగల్‌ ఫోరం వాళ్ళు కూడా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రియల్‌ ఎస్టేట్‌, స్పాన్సర్లతో ఓ కార్యక్రమం కూడా  జరుగుతుంది. మేట్రిమోని కమిటీ ఆధ్వర్యంలో వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం ఉంటుంది.

 రెండో రోజు సాయంత్రం సంగీత దర్శకులు ఎస్‌.థమన్‌ నేతృత్వంలో విభావరి ఏర్పాటు చేశారు.

జులై 3 

ఉదయం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి కళ్యాణం నిర్వహించ నున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో టీటీడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ఇతర అధికారులు పాల్గొంటున్నారు.    శ్రీనివాసుడి కళ్యాణంలో భాగంగా ప్రముఖ నేపథ్య గాయకులు పద్మశ్రీ శోభారాజు, నిహాల్‌ కొండూరి ఆధ్యాత్మిక సంగీతంతో ఆహూతులను భక్తి పారవశ్యం లోకి తీసుకెళ్లనున్నారు. సిఎంఇ కార్యక్రమంలో భాగంగా వైద్యరంగంపై సదస్సు జరుగుతుంది. బిజినెస్‌ ఫోరం ఆధ్వర్యంలో వాణిజ్య ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తున్నారు. సద్గురు ప్రసంగం, ఆటా సయ్యంది పాదం, హార్ట్‌ఫుల్‌ నెస్‌ మెడిటేషన్‌, అవధాన కార్యక్రమం, టిడిఎఫ్‌ కార్యక్రమం, అలూమ్ని కమిటీ ఆధ్వర్యంలో కళాశాలల పూర్వ విద్యార్థుల పరిచయ కార్యక్రమాలు జరుగుతాయి. కిడ్స్‌ కార్యక్రమాలు, ఉమెన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో మహిళలకోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. స్థానిక కళాకారుల నృత్య ప్రదర్శనలు ఉంటాయి. సాహిత్య సమావేశాలు, సీనియర్‌ సిటిజన్ల కోసం ఓ కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇ`గ్లోబల్‌ పేరుతో స్పాన్సర్లతో ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. మేట్రిమోని ఫోరం ఆధ్వర్యంలో వధూవరుల తల్లితండ్రులతో సమావేశం ఇతర కార్యక్రమాలు జరుగుతాయి. సోషల్‌ మీడియా, యూత్‌ ఫోరం, టాలీ వుడ్‌, ఇతర కళాకారులు, ప్రముఖుల ప్రసంగాలతో 3వ రోజు కార్యక్రమా లను ఏర్పాటు చేశారు. 3వ రోజు గ్రాండ్‌ ఫినాలేలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఇళయ రాజా తన 32 మంది ట్రూప్‌తో అతిథులను అలరించనున్నారు.

సినీ కళాకారులు...

ఈ వేడుకలకు టాలీవుడ్‌ నుంచి పెద్ద ఎత్తున సినీతారలు విచ్చేస్తు న్నారు. హీరోలు అడవి శేషు, డైరెక్టర్లు శేఖర్‌ కమ్ముల, అర్జున్‌రెడ్డి ఫేం సందీప్‌ వంగా, హీరోయిన్లు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నివేదా థామస్‌, డాన్స్‌ డైరెక్టర్‌ శేఖర్‌ మాస్టర్‌, వీజే సన్నీ, సింగర్‌ రాం మిరియాల, సింగర్‌ మంగ్లీ.. ఇంకా పలువురు ప్రముఖులు వేడుకలకు వస్తున్నారు. సాహితీ వేత్తలు జొన్నవిత్తుల రాంజోగయ్య శాస్త్రి, సీనియర్‌ నటులు తనికెళ్ల భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలవను న్నారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ అష్టవధానంతో అలరించబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు

ప్రత్యేక చిరునామా

పుట్టి పెరిగిన మాతృభూమిపై మమకారం చూపించేలా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీకి అయిదు స్టాళ్లు, తెలంగాణకు అయిదు స్టాళ్లు ఇందులో ఉంటాయి. రెండు ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ కీలక అంశాలను ఈ స్టాళ్ల ద్వారా ప్రవాసాంధ్రులకు వివరించను న్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం స్టూడెంట్‌ అవేర్‌నెస్‌ డెస్క్‌, అలాగే మెడికల్‌, టూరిజం, రియల్‌ ఎస్టేట్‌తో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలందిస్తారు.

అతి పెద్ద వేడుకగా చేస్తున్నాము

భువనేష్‌ బుజాల, ఆటా అధ్యక్షుడు

కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రపంచం కోలుకున్న తర్వాత నిర్వహిస్తున్న అతిపెద్ద తెలుగు పండుగ ఇది. ప్రవాసాంధ్రులందరిని ఒక్కతాటిపైకి తెచ్చి ఒక కుటుంబం అన్న భావన తీసుకురావడానికే ఆటా మహాసభలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నాము. ఘనమైన తెలుగు వారసత్వాన్ని అందించడం, పుట్టిన నేలకు తమ వంతు సాయం అందించడం, కొత్త తరానికి స్పూర్తిదాయక సందేశం ఇవ్వడమే ఆటా ముందున్న లక్ష్యాలు. ఈ మహాసభలను విజయవంతం చేయడానికి అమెరికాలోని కొత్తతరం ముందుకు వచ్చి పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మన సంస్కృతి, మన సంప్రదాయాలను తెలియజేసేలా కార్యక్రమాలను కూడా ఇందులో ఏర్పాటు చేశాము.

ప్రముఖులతో సమావేశాలు

కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ సుధీర్‌ బండారు

ఆటా మహాసభలకు ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులతోపాటు, అమెరికాలో ఉన్న ప్రముఖులను కూడా ఒకే వేదికపై చూడవచ్చు. సినిమా తారలతోపాటు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, వాణిజ్య ప్రముఖులు, సాహితీవేత్తలు ఇలా ఎందరో ఈ మహాసభలకు వస్తున్నారు. ఇంతమంది వస్తున్న ఈ కార్యక్రమంలో ఎన్నో మరచిపోలేని విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశాము.

 

 

Tags :