ASBL NSL Infratech

పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్

పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్

సేద్యాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు తమ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులను తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం రెండో రోజు ఐయోవాలో ఏర్పాటైన అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం (USISPF) రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని స్ఫూర్తిదాయక ఉపన్యాసమిచ్చారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భూసార పరీక్షలు చేయించి, ఏ ప్రాంతానికి ఏ పంట వేయాలో కర్షకులకు కచ్చితమైన మార్గదర్శనం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, ప్రాథమిక రంగానికి కొత్త ఊపునిచ్చే మేలిమి పద్ధతుల పరిశీలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం అమెరికాలో పర్యటిస్తోంది. పలు విత్తన, వ్యవసాయ సంస్థలకు చెందిన సీఎఫ్‌వోలు, శాస్త్రవేత్తలు హాజరైన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రాథమిక రంగమిషన్‌గా ఒక దార్శనికతతో అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకోసం మిలిందా అండ్ గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించడానికి ముందుకు వచ్చిందని చంద్రబాబు చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆఫ్రికా వ్యవసాయ రంగంలో అద్భుతాలు చేసిందన్నారు. వచ్చే నెలలో విశాఖలో నిర్వహించే రాష్ట్ర స్మార్ట్ ల్యాండ్ హోల్డర్స్ సదస్సుకు బిల్ గేట్స్, మిలిందా గేట్స్ హాజరవుతున్నారని తెలిపారు. భూసార పరీక్షల తర్వాత ఏ ప్రాంతంలో ఏ పంట వేస్తే అత్యధిక దిగుబడులు సాధించవచ్చో గేట్స్ ఫౌండేషన్ ఆఫ్రికాలో ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో భూసార పరీక్షలతో విశ్లేషణ వివరాల పట్టికల (ప్రొఫైల్స్ ) తయారీకి గేట్స్ ఫౌండేషన్ సంసిద్ధత వ్యక్తం చేసిందని వివరించారు. 

నూతన ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, వ్యవసాయ రంగంలో పెద్దఎత్తున సాంకేతికత మేళవించి రైతుకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టినట్లు చంద్రబాబు వివరించారు. 

Click here for PhotoGallery

Tags :