గాజువాకలో చరిత్ర తిరగరాసేది ఎవరు.. అమర్నాథ్ లేక శ్రీనివాసరావు..
రాజకీయాలలో వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. అలాగే ఎన్నికల బరిలో వారసులు పోటీ పడడం చాలా సందర్భాలలో జరిగింది. అయితే ఈసారి జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఇద్దరు వారసుల మధ్య టైట్ పొలిటికల్ వార్ ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు ఈ ఇద్దరి తండ్రులు ప్రత్యర్ధులుగా తలపడితే.. ఇప్పుడు కొడుకులు ఎన్నికల సమరానికి కాలు దువ్వుతున్నారు. వాళ్లు మరెవరో కాదు.. మంత్రి గుడివాడ అమర్నాథ్.. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమర్నాథ్.. వైసీపీ తరఫున బరిలో దిగుతుంటే.. శ్రీనివాస రావు టీడీపీ తరఫున సై అంటున్నారు.
గతంలో ఈ ఇద్దరి తండ్రులు కూడా పరస్పరం తలపడ్డారు. అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాధరావు.. శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం.. ప్రత్యర్ధులుగా ఢీ కొట్టారు. 1989లో జరిగిన ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి ఇద్దరు పోటీకి దిగారు. అప్పట్లో గాజువాక.. పెందుర్తి నియోజకవర్గంలో ఉండడం గమనార్హం. అప్పటి ఎన్నికల్లో సింహాచలంపై గురునాధరావు గెలిచారు. మూడున్నర దశాబ్దాల తర్వాత తిరిగి మళ్ళీ వారసులు అక్కడి నుంచే పొలిటికల్ వార్ మొదలుపెట్టారు. ఈ ఇద్దరు తొలిసారి ఎంపీలుగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు టఫ్ ఫైట్ నడుస్తోంది. శ్రీనివాసరావు పై అమర్నాథ్ గెలిచి తండ్రి రికార్డును తిరగరాస్తాడో.. లేక అమర్నాథ్ పై శ్రీనివాసరావు విజయ బావుటా ఎగురవేసి చరిత్రను తిరగరాస్తాడో చూడాలి.