నామినేషన్ లేట్.. అధికారి కాళ్లు పట్టుకున్న అభ్యర్థి
టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్తో పాటు ఎన్నో పోటీ పరీక్షల సమయంలో ‘ఒక్క నిమిషం ఆలస్యం’ నిబంధనతో ఎంతోమంది విద్యార్థులు, అభ్యర్థుల జీవితాలు తలకిందులైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల సమయంలోనూ అదే జరుగుతోంది. అనేక చోట్ల నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువు దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు పోటీ పడి మరీ నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు. అయితే ఎన్నికల నామినేషన్ దాఖలుకు కూడా ఈ ‘ఒక్క నిమిషం ఆలస్యం’ నిబంధన వర్తిస్తుండడం.. ఏకంగా ఓ అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి కాళ్లు పట్టుకునేలా చేసింది. మరో ఐదేళ్ల వరకు ఆయనకు నామినేషన్ వేసే పరిస్థితి లేకుండా చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన దళిత బహుజన పార్టీ అభ్యర్థి మాతంగి హనుమయ్య.. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లకు గురువారం చివరి రోజు కావడంతో నామినేషన్ వేయడానికి వెళ్లారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. నిమిషం ఆలస్యం అయినా నామినేషన్ వేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతించదు. దాంతో మాతంగి హనుమయ్యను పోలీసులు గేటు బయటే ఆపేశారు. తనను నామినేషన్ వేసేందుకు అనుమతించాలని అక్కడే ఉన్న ఎన్నికల అధికారి కాళ్లు కూడా పట్టుకున్నారు మాతంగి హనుమయ్య. కానీ రూల్స్ ఒప్పుకోవంటూ సదరు అధికారి ఆయనను లోపలికి అనుమతించలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరోవైపు ‘ఇప్పుడు తెలిసిందా ఒక్క నిమిషం ఆలస్యం విలువ..’ ‘రాజకీయ నాయకులు తీసుకువచ్చిన ఈ నిబంధన ఎంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుందో అర్థం అయిందా..?’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://x.com/ChotaNewsTelugu/