చైనాలో జలప్రళయం..
చైనాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు దక్షిణ ప్రావిన్స్లోని గ్వాంగ్డాంగ్ ..సముద్రాన్ని తలపిస్తోంది. ఆరుదశాబ్దాల్లో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో కురుస్తున్న వర్షాల కారణంగా.. పదుల సంఖ్యలో మృతిచెందగా..పలువురు గల్లంతయ్యారు. పెరల్ నది దిగువన ఉన్న పెరల్ రివర్ డెల్టా కూడా నీటిలో మునిగిపోయింది. భారీవర్షాల కారణంగా దాదాపు లక్షా 25 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 26 వేల మందిని షెల్టర్ హోమ్లకు పంపారు.
ఏప్రిల్ నెలలో గ్వాంగ్జౌలో 60.9 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. 1959 తర్వాత గ్వాంగ్జౌలో ఇంత భారీ వర్షాలు కురవడం ఇదే తొలిసారని సమాచారం. ఇక, జియాంగ్జీ ప్రావిన్స్లో కూడా వర్షం విధ్వంసం సృష్టించింది. దీంతో పెద్దఎత్తున్న జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.ఈ వర్షాల కారణంగా పంటలు కూడా పెద్ద ఎత్తున దెబ్బ తిన్నాయి. గ్వాంగ్డాంగ్ను ఫ్యాక్టరీ కర్మాగారంగా పిలుస్తారు. ఇక్కడ భారీ స్థాయిలో వస్తువులను తయారుచేసే పలు కంపెనీలు ఉన్నాయి. ఈ వర్షాలు, వరదల కారణంగా ఆయా కంపెనీలు భారీ నష్టాలు చవి చూస్తున్నాయి.
మరోవైపు చైనాలో...100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం చైనాలోని పలు ప్రావిన్సులు వరదల్లో మునిగిపోయాయి. చైనాలోని బి నదిలో నీటిమట్టం 19 అడుగులకు చేరుకుంటుందని హెచ్చరికలు జారీ చేశారు. చైనాలో సంభవించిన ఈ వరద లక్షలాది ఇళ్లను ముంచేసింది. దక్షిణ చైనాలోని పలు నగరాలు గత వారం రోజులుగా కుండపోత వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దక్షిణ చైనాలోని 44కు పైగా నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. చైనాలోని పలు ప్రాంతాల్లో వరదల వంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో లక్షా పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒక్క చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోనే 12 కోట్ల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు.
ఉత్తర గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో వరదలు మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాయి. ఉత్తర గ్వాంగ్డాంగ్లోని నదులలో నీరు వంద సంవత్సరాలలో అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుందని నివేదికలు ఉన్నాయి. చైనాలో ఈ విధ్వంసానికి కారణం ఏప్రిల్లో సాధారణ వర్షపాతం కంటే అధికవర్షం కురవడమే. ఏప్రిల్లో క్వింగ్యువాన్లో సగటు వర్షపాతం 444 మిమీ, ఇది గత సంవత్సరం మొత్తం వర్షపాతం కంటే రెట్టింపు. భారీవర్షాలు,వరదలతో విద్యుత్ సరఫరా స్తంభించింది.ప్రస్తుతం దక్షిణ చైనాలో 16 లక్షల మంది ప్రజలు కరెంటు లేకుండా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెయ్యికి పైగా పాఠశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం, దక్షిణ చైనాలో అత్యవసర సేవలు అలర్ట్ మోడ్లో ఉన్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చైనా నుంచి వస్తున్న నివేదికలు చెబుతున్నాయి.