ఎన్నికల ఖర్చులో కూడా టాప్ లో నిలుస్తున్న భారత్..
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. ఏ దేశంలో లేనంతగా మన దేశంలో భారీ సంఖ్యలో దాదాపు 96.6 కోట్ల మంది ఓటర్లు ఈసారి ఎన్నికల్లో ఓట్లు వేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంగా బయటకు వచ్చిన కొన్ని లెక్కలు తెలిస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. మొత్తం మన దేశంలో చిన్న పార్టీ దగ్గర నుంచి పెద్ద పార్టీ వరకు కొన్ని వందల పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలకు సంబంధించిన ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల పర్సనల్ ప్రచారం, ఎలక్షన్ నిర్వహణ ఖర్చు అంతా కలిపి తడిసి మోపెడవుతుంది. పైగా ఈ ఖర్చు ప్రతి ఐదు సంవత్సరాలకి రెట్టింపు కావడం గమనార్హం. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాకముందే రాజకీయ పార్టీలు సభలు, ర్యాలీలు ,రోడ్ షోలు అంటూ ఖర్చు మొదలు పెట్టేస్తారు.
ప్రచార వాహనాలు, ప్రచార సామగ్రి, కార్యకర్తల మెయింటెనెన్స్ ఇలా మరి కొన్ని అదనపు ఖర్చులు ఉంటాయి. ఈసారి మన దేశంలో ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 1.35 లక్షల కోట్లు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ వెల్లడించింది. ఈ ఖర్చులో ఎన్నికల సంఘం, ప్రభుత్వాలు, అభ్యర్థులు, వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు అన్ని కలిపి చేసే ఖర్చులను లెక్కించడం జరిగింది. ఎన్నికల తేదీ ప్రకటించడానికి నాలుగు నెలల ముందు నుంచి చేసిన ఖర్చులను కూడా ఇందులోనే జమ చేశారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల వ్యయం కేవలం 60 వేల కోట్లు.. ఇందులో సుమారు 45 శాతం ఖర్చు ఒక్క బీజేపీ పార్టీ పెట్టిందట. దీన్నిబట్టి ఈసారి ఎన్నికల ఖర్చు రెట్టింపు అయిందని అర్థమవుతుంది. ఈ డబ్బులు సగం పైన ఎవరి జేబు లోంచి వస్తుందో అందరికీ తెలిసిందే.. ప్రజల డబ్బు.. ప్రజల కోసం కాక.. ప్రజలను పాలించడం కోసం.. ఇంత భారీ మొత్తంలో ఉపయోగిస్తున్నారు. ఇది మన దేశంలో రాజకీయాల స్పెషాలిటీ.