పరువు బజారుకీడ్చుకుంటున్న వైఎస్ ఫ్యామిలీ!
వై.ఎస్.రాజశేఖర రెడ్డి కుటుంబంలో విభేదాలు బహిరంగ రహస్యమే. కొన్నేళ్ల వరకూ ఆ ఇంటి విషయాలు బయటకు వచ్చేవి కావు. అందరూ ఏకతాటిపై నడిచేవారు. అయితే వివేకా హత్య తర్వాత ఆయన కుటుంబం బయటికొచ్చింది. కొంతకాలం కిందట జగన్ తో విభేదాల నేపథ్యంలో సోదరి షర్మిల కూడా బయటపడ్డారు. ఇప్పుడు వీళ్లిద్దరూ ఒక్కటవగా మిగిలిన వాళ్లంతా ఏకమయ్యారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నారు. వైఎస్ ఫ్యామిలీ ఇది అని ఒకప్పుడు ఘనంగా చెప్పుకున్న వాళ్లంతా ఇప్పుడు మేడిపండు చూడ అని సామెతలు విసురుతున్నారు.
వివేకానంద రెడ్డి హత్య రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ఆ హత్య ఎవరు చేశారో సీబీఐ దాదాపు ఒక క్లారిటీకి వచ్చింది. ఛార్జ్ షీట్లలో కీలక విషయాలు బయటపెట్టింది. దీంతో సొంత కుటుంబీకులే ఇంత పని చేస్తారా అని వివేకా ఫ్యామిలీ ఆశ్చర్యపోయింది. అప్పటి నుంచి నిందితులకు శిక్ష పడాలంటూ సునీత అండ్ కో పోరాడుతోంది. ముఖ్యంగా అవినాశ్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని వివేకా కుటుంబం ఫైట్ చేస్తోంది. మరోవైపు జగనన్న వదిలిన బాణం అంటూ అన్న జైలుకు వెళ్లినప్పుడు సుదీర్ఘ పాదయాత్ర చేశారు వైఎస్ షర్మిల. వైసీపీని బతికించారు. తాను కూడా రాజకీయాల్లోకి ఆశించారు. అవినాశ్ స్థానంలో షర్మిలకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని వివేకా జగన్ కు సూచించారని.. అయితే ఆయన ఇవ్వలేదని తాజా కథనాలు చెప్తున్నారు. మరోవైపు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్, షర్మిల మధ్య ఆస్తి పంపకాల విషయంలో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆమె కూడా జగన్ ను విభేదించి బయటికొచ్చేశారు.
జగన్ తో షర్మిల గ్యాప్ ఎవరూ పూడ్చలేని స్థాయికి వెళ్లిపోయింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు తల్లి విజయమ్మ ప్రయత్నించినా సాధ్యపడలేదు. అందుకే ఇద్దరి మధ్య ఆమె నలిగిపోతోంది. ఈ ఎన్నికల్లో ఎవరివైపు నిలబడాలో అర్థంకాక అమెరికాలో మనవడి దగ్గరకు వెళ్లిపోయింది. సొంత అన్నే ఇలా చేస్తారని ఊహించలేదని ఒకవైపు షర్మిల, మరోవైపు సునీత ఆరోపిస్తున్నారు. తాము కూడా వైఎస్ బిడ్డలమేనని తమకు న్యాయం చేయాలని కొంగుపట్టి అడుగుతున్నారు. ఇది వై.ఎస్. కుటుంబ అభిమానులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.
మరోవైపు చెల్లెళ్ల పోరాటాన్ని జగన్ లైట్ తీసుకోవట్లేదు. పైగా వాళ్లపై తన బృందాన్ని ఎగదోలి ప్రతివిమర్శలు చేయిస్తున్నారు. వాళ్లను చంద్రబాబు ఆడిస్తున్నారని.. ఇది వాళ్ల కుట్ర అని ఆరోపిస్తున్నారు. ఇది మరింత రచ్చ రాజేస్తోంది. తాజాగా జగన్ మేనత్త విమలమ్మ.. షర్మిల, సునీతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు. ఆమె కొడుక్కు జగన్ ప్రభుత్వ పనులు ఇచ్చాడు కాబట్టి ఆమె అలాగే మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. ఇలా వైఎస్ కుటుంబంలో గతంలో ఎన్నడూ చూడని సన్నివేశాలను ఇప్పుడు చూస్తుండే సరికి ఆయన్ను అభిమానించే వాళ్లంతే ముక్కున వేలేసుకుంటున్నారు.