అమెరికా వీసా మరింత కాస్ట్లీ
అమెరికా వెళ్లే భారతీయులపై అధిక భారంపడనుంది. ఎందుకంటే ...H-1B వీసా సహా కొన్ని కేటగిరీల దరఖాస్తు రుసుములను పెంచుతున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. వీసాల అప్లికేషన్ ఫీజులను పెంచడం 2016 తర్వాత మళ్లీ ఇప్పుడేనని బైడెన్ సర్కారు వెల్లడించింది.
తాజా నిర్ణయంతో H-1B వీసా దరఖాస్తు ధర 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరిగింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ధరను కూడా 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు. అయితే, ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఎల్-1 వీసా దరఖాస్తు రుసుమును 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు పెంచారు. ఈబీ-5 వీసాల అప్లికేషన్ ఫీజులను 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ తమ ఫెడరల్ నోటిఫికేషన్లో తెలిపింది.
అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు హెచ్-1బీ వీసా అవకాశం కల్పిస్తుంది. ఈ వీసాలను వినియోగిస్తున్న వారిలో భారతీయులే అధికం. ఇక, ఈబీ-5 ప్రోగ్రామ్ను 1990లో ప్రారంభించారు. అమెరికన్ స్థానికులకు కనీసం 10 మందికి ఉద్యోగాలు కల్పించేలా.. కనిష్ఠంగా 5లక్షల డాలర్ల పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభించేవారికి ఈ వీసాలను జారీ చేస్తారు. ఎల్-1 అనేది.. కంపెనీలో అంతర్గతంగా బదిలీ అయ్యే ఉద్యోగులకు ఇచ్చే వీసా. మల్టీ నేషనల్ కంపెనీలు విదేశాల్లో ఉన్న తమ బ్రాంచీల నుంచి ఉద్యోగులను కొంతకాలం పాటు అమెరికాకు తీసుకొచ్చి అక్కడ విధులు నిర్వహించుకునేందుకు ఈ వీసా అవకాశం కల్పిస్తుంది.