గుటెరస్ కీలక ప్రకటన...ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే
అక్టోబరు 7 నాటికి హమాస్ దాడుల్లో ఐరాస ఏజెన్సీ యూఎన్ ఆర్డబ్ల్యూఏ ఉద్యోగుల పాత్రపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ చేసిన ఈ ఆరోపణలతో ఆందోళనకు గురయ్యా. ఐరాస సిబ్బంది ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే వారిని జవాబుదారీ చేస్తాం. క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. ఇటువంటి కేసుల్లో విచారణకు సంస్థ తరపున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఇజ్రాయెల్ ఆరోపణల నేపథ్యంలో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ తదితర దేశాలు యూఎన్ఆర్డబ్ల్యూఏకు నిధులను నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో మొత్తం సిబ్బందిని శిక్షించడం తగదని గుటెరస్ స్పష్టం చేశారు. సంస్థ కార్యకలాపాల కొనసాగింపుకు హామీ ఇవ్వాలని సంబంధిత దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ కోసం పని చేసే వేల మంది సిబ్బంది మానవతా కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. కొందరు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. బాధితులకు వారి సేవలు తప్పనిసరి అని పేర్కొన్నారు.