వివిధ నగరాల్లో కమనీయంగా జరిగిన టీటీడి శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు
డాలస్లో శ్రీనివాస కళ్యాణ వేడుకలకు దాదాపు పదివేల మంది హాజరు
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు, శ్రీదేవి, భూదేవి సమేత తిరుమల శ్రీనివాసుడి కల్యాణం అమెరికాలోని డాలస్లో అంగరంగవైభవంగా జరిగింది. జూన 25 శనివారం రోజున డాలస్లోని క్రెడిట్ యూనియన ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్ వేదికగా కన్నుల పండువగా సాగింది. కొవిడ్ వల్ల వెంకన్న దర్శనభాగ్యానికి నోచుకోలేకపోయిన ఇక్కడి తెలుగువారందరూ తమకు దక్కిన అరుదైన అద్భుత అవకాశానికి మురిసిపోయారు. ఏడుకొండలు దిగి, సప్త సముద్రాలు దాటి వచ్చిన వెంకన్నను దర్శించుకునేందుకు పన్నెండువేల మందికి పైగా తరలివచ్చారు. మరో సముద్రంలా కదిలివచ్చిన జనసమూహం తమకు దక్కిన ఈ అవకాశానికి తన్మయులవుతూ వెంకన్న సేవలో ఆనంద పరవశులయ్యారు. చివరకు స్టేడియాన్ని గుడిలా మార్చడంపై అభినందనలు వెల్లువెత్తాయి. టీటీడీ చైర్మన వైవీ సుబ్బారెడ్డి దంపతులతో పాటు విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కడప జడ్పీ చైర్పర్సన్ అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేందర్రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై విశేష సేవల్లో పాల్గొన్నారు.
టీటీడీ అర్చకులు, వేద పండితులు కేవలం వెంకన్న కల్యాణానికే పరిమితం కాకుండా సుప్రభాత సేవతో మొదలుపెట్టి, తోమాల సేవ, అభిషేక సేవలు ఘనంగా నిర్వహించారు. వైఖానస ఆగమం ప్రకారం నిర్వహించిన ఈ సేవల్లో పాల్గొన్న వారికి టీపాడ్ నిర్వాహకులు ఒక్కో సేవను అనుసరించి వేర్వేరుగా లడ్డూ ప్రసాదం, వస్త్రం, ఐదు గ్రాముల బంగారు నాణెం, వెండి నాణెం, కంచిపట్టు చీర, పట్టు దోతీ, గద్వాల్ పట్టుచీర, పట్టు దుపట్టా, ఇక్కత బ్లౌజ్ పీస్తో పాటు వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యం కల్పించారు.
నేత్రపర్వంగా..
తొలుత దేవేరులకు కంకణధారణ చేసిన పండితులు కార్యక్రమం ఆసాంతం శ్రీనివాసుడు ఇక్కడే మనసు లగ్నం చేసేలా మనోజపం చేస్తూ పూజలను మనోరంజకంగా, నేత్రపర్వంగా సాగించారు. తమకు ఇంతటి దర్శన, సేవాభాగ్యం కలగడం పట్ల తెలుగువారందరూ పులకించిపోయి టీపాడ్ నిర్వాహకులకు, టీటీడీ చైర్మన వైవీ సుబ్బారెడ్డి దంపతులకు మరీమరీ ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ ఎన్ఆర్టీ సమన్వయంతో..
ఆమెరికాలో ఉంటున్న తెలుగువారందరికీ పద్మావతీ అలిమేలు సమేత తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ ప్రభుత్వం ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సమన్వయంతో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలుగువారు ఎక్కువగా ఉండే అమెరికాలోని తొమ్మిది నగరాల్లో శ్రీనివాస కల్యాణానికి అంకురార్పణ చేసింది. జూన 25న డాలస్ వేదికగా స్వామి వారి కల్యాణం నిర్వహించే అవకాశం తమకు దక్కడం పూర్వజన్మ సుకృతంగా డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) పేర్కొంది. అమెరికా నగరాల్లో శ్రీదేవి, భూదేవి సమేత వెంకన్న కల్యాణం నిర్వహించాలన్న ఆలోచన వచ్చిందే తడవు ఆంధప్రదేశ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ బృందంతో చర్చలు జరిపి, కార్యక్రమానికి అంకురార్పణ చేసేలా చొరవ తీసుకోవడమే కాకుండా డాలస్లో టీపాడ్కు ఆ అవకాశమిచ్చేందుకు కారకులైన నాటా అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి కొర్సపాటికి ఈ సందర్భంగా టీపాడ్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ అవకాశం ఇచ్చిన ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డికి, టీటీడీ చైర్మన వైవీ సుబ్బారెడ్డికి, టీటీడీ అర్చకులు, పండితులకు, ఏపీ ఎనఆర్టీ చైర్మన వెంకట్ మేడపాటికి టీపాడ్ ధన్యవాదాలు తెలిపింది.
టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రవాణా తదితర ఏర్పాట్లు చేయడమే కాకుండా డాలస్లోని స్థానిక అధికారులు, వ్యాపారులు, రెస్టారెంట్లతో చర్చించి కార్యక్రమ నిర్వహణను సుగమం చేసిన రఘువీర్ బండారును టీపాడ్ బృందంతో పాటు వేడుకకు హాజరైన తెలుగువారందరూ అభినందించారు. లాజిస్టిక్ సహకారం అందించిన తిరుపతికి చెందిన ప్రొఫెసర్ భాను సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమానికి రమణ లష్కర్, ఇందు పంచెర్పుల, అశోక్ కొండల, రామ్ అన్నాడి, మాధవి సుంకిరెడ్డి, సుధాకర్ కలసాని, విజయ్ తొడుపునూరి, చంద్రారెడ్డి పోలీస్, కరణ్ పోరెడ్డి, పాండురంగారెడ్డి పాల్వాయి, రవికాంత రెడ్డి మామిడి స్టీరింగ్ కమిటీ సభ్యులు గా విశేష సేవలిందించారు. అజయ్ రెడ్డి, రావు కల్వల, జానకి రాంరెడ్డి మందడై అడ్వయిజరీ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు.
వివిధ కమిటీలకు చైర్స్గా వ్యవహరించిన నరేష్ సుంకిరెడ్డి, బాల గంగవరపు, స్వప్న తుమ్మపాల, మంజుల తొడుపునూరి, రూప కన్నయ్యగారి, మధుమతి వ్యాసరాజు, మాధవి లోకిరెడ్డి, అనురాధ మేకల, లక్ష్మీ పోరెడ్డి, శ్రీనివాస్ అన్నమనేని, రత్న ఉప్పల, శ్రీధర్ వేముల, రేణుక చనుమోలు, జయ తెలకపల్లి, శ్రీనివాస్ తుల, లింగారెడ్డి ఆల్వా, సుమన బసని, రోజా ఆడెపు, గాయత్రి గిరి, మాధవి మెంట, శ్రీనివాస్ రెడ్డి పాలగిరి, వెంకట్ అనంతుల, వీర శివారెడ్డి, రవీంద్రనాథ్ ధూలిపాల, సంతోషి విశ్వనాథుల, రాజా వైశ్యరాజు, అభిషేక్రెడ్డి కార్యక్రమం విజయవంతానికి ఎనలేని కృషి చేశారు.
ఈ సందర్భంగా టాంటెక్స్ ప్రెసిడెంట్ ఉమా మహేశ్వర్ కి మరియు ఇతర తెలుగు సంస్థలైన నాటా, ఆటా, తానా, నాట్స్, టీటిఎకు టీపాడ్ కృతజ్ఞతలు తెలిపింది. కాగా, ఈ సందర్భంగా శ్రీనివాస కళ్యాణం డల్లాస్ మహానగరంలో జరగడానికి మరియు టిపాడ్కి ఈ అవకాశం రావడానికి సహాయం చేసిన నాటా ప్రెసిడెంట్ శ్రీధర్రెడ్డి కొర్సపాటి గారికి కృతజ్ఞతలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రవాస ఆంధ్రుల అధికార ప్రతినిధి శ్రీ రత్నాకర్ పందిగాయలకి కూడా టిపాడ్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు.
వైవీ సుబ్బారెడ్డి దంపతులకు సత్కారం
కాగా, ఆంధప్రదేశ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డి ఆదేశానుసారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి మూర్తులను అర్చకులు, పండితులతో సహా వెంటబెట్టుకుని వచ్చి, ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి విజయవంతంగా నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన వైవీ సుబ్బారెడ్డి దంపతులను, అర్చకులు, పండితులను టీపాడ్ అధ్యక్ష కార్యదర్శులు విశేష రీతిలో సత్కరించారు.
డాలస్లోని క్రెడిట్ యూనియన ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకకు హాజరై పద్మావతీ అలివేలు సమేత వెంకన్ననను దర్శనం చేసుకున్న వారందరికీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు.
సియాటెల్లో....
టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా సియాటెల్ నగరంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణమహోత్సవం ప్రాంగణమంతా వేద మంత్రాలతో మారుమోగింది. కళ్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేనఆరాధన, అంకు రార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణమాయిరం పారాయణం చేశారు. హారతితో కళ్యాణోత్సవం ముగిసింది. టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, పీపుల్ టెక్ సంస్థ సీఎండీ , కళ్యాణోత్సవానికి ఆర్థిక సహకారం అందించిన శ్రీ టీజీ విశ్వప్రసాద్ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కళ్యాణ మహోత్సవానికి తరలివచ్చారు.
బే ఏరియాలో....
శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో టీటీడీ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి శ్రీనివాస కల్యాణాన్ని ఇటీవల వైభవంగా నిర్వహించారు. ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కల్యాణోత్సవ క్రతువులో భాగంగా తొలుత అన్ని వస్తువులను, ప్రాంగణాలను శుభ్రపరచడానికి నిర్వహించే పవిత్ర కర్మ అయిన పుణ్యాహవాచనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి సర్వసైన్యాధిపతి అయిన విశ్వక్సేనుడి ఆరాధనను చేపట్టారు. తరువాత కలశంలోని శుద్ధి చేసిన నీటిని హోమగుండం, మంటపంలోని అన్ని వస్తువులపై చల్లారు. అనంతరం వైదిక క్రతువు అయిన అంకురార్పణలో భాగంగా అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి పూజించారు. వేద మంత్రాల నడుమ ప్రతిష్టా బంధన నిర్వహించారు. ప్రాయశ్చిత హోమం నిర్వహించి దేవతామూర్తలకు నూతన పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం కన్యాదానం, మాంగల్యధారణ, వారణమాయిరం చేపట్టారు. చివరిగా శ్రీదేవిని కుడివైపున, భూదేవిని ఎడమ వైపున కూర్చోబెట్టి స్వామివారికి కర్పూర హారతి, నక్షత్ర హారతి, మహా హారతి ఇవ్వడంతో కల్యాణోత్సవం ముగిసింది.
ఈ ఘట్టాలను తిలకించి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ప్రవాసాంధ్రుల సమితి చైర్మన్ మేడపాటి వెంకట్, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్, నాటా అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.