ఏ క్షణమైనా పిడుగులాంటి వార్త వినొచ్చు : తుమ్మల
సిద్ధం కండి ఏ క్షణమైనా పిడుగులాంటి వార్త వినొచ్చు అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరావు పార్టీ శ్రేణులతో అన్నారు. గతంలో తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోండని కార్యకర్తలకు సూచించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించిన సందర్భంగా తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధిపైనే దృష్టి పెట్టానని, కార్యకర్తలను పూర్తి స్థాయిలో కలవలేకపోయానని చెప్పారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానని, ఇప్పుడు మాత్రం పాలేరుపైనే దృష్టి పెట్టానని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడంటూ కొందరు కార్యకర్తలు ఆయన్ని ప్రశ్నించగా ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు, సిద్ధంగా ఉండాలంటూ అన్నారు.
ఖమ్మంలో టీఆర్ఎస్లో చాలాకాలంగా అంతర్గత పోరు నడుస్తోంది. తుమ్మల క్రియాశీలక రాజకీయాలతో పాటు టీఆర్ఎస్ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పాలేరు నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. అందుకే మళ్లీ క్రియాశీలకంగా మారారు. తాజాగా తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పాలేరు టీఆర్ఎస్ టికెట్ తుమ్మలకు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.