పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు బిగ్ షాక్
లోక్ సభ ఎన్నికల ముందు బీఆరెస్ పార్టీకి షాక్ తగిలింది. సింగరేణిలో కారు పార్టీకి బలమైన కార్మిక బలంగా ఉన్న సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ తాజాగా గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించింది. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ ప్రకటన రావడంతో బీఆరెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలినట్లయింది. కారు పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నామని, ఇక స్వతంత్రంగానే వ్యవహరిస్తామని టీబీజీకేఎస్ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నాడు సంఘ సమావేశంలో ప్రత్యేక తీర్మానం కూడా చేసుకుంది.అలాగే ఏప్రిల్లో కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు టీబీజీకేఎస్ ప్రకటించింది.
ఇదిలా ఉంటే టీబీజీకేఎస్ తీసుకున్న నిర్ణయంతో గులాబీ నేతల్లో టెన్షన్ మొదలైంది. దీనికి కారణం వరంగల్, పెద్దపల్లి, అదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని ఓటర్లలో భారీగా కార్మిక ఓటర్లు ఉండడమే. పార్టీ నుంచి విడిపోవడంతో ఈ దఫా లోక్ సభ ఎన్నికల్లో వాళ్ళ ఓట్లన్నీ గులాబీ పార్టీకి దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది పార్టీ అభ్యర్థుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపించే అవకాలున్నాయి. ఇది పార్టీ నేతల్లో కలవరపాటు కలిగిస్తోంది.