బీజేపీలోకి మాజీరాయభారి తరణ్ జిత్ సింగ్..
అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంధును బిజెపిలో చేర్చుకున్నారు, 2020 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి వరకు వాషింగ్టన్ లో భారత రాయబారిగా పనిచేసిన ఆయన ఇటీవల వాషింగ్టన్ డీసీ నుంచి రిలీవయ్యారు..అక్కడ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శులు వినోద్ తావ్డే, తరుణ్ చుగ్, జాతీయ కార్యదర్శి మంజిందర్ సింగ్ సిర్సా, మీడియా కో-హెడ్ డాక్టర్ సంజయ్ మయూఖ్ ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.
పంజాబ్ అభివృద్ధికి సంధు కుటుంబం కట్టుబడి ఉందన్నారు తావ్డే. పంజాబ్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగానే సంధును బీజేపీలో చేర్చుకున్నట్లు వెల్లడించారు. సంధు పార్టీలో చేరడం ద్వారా పంజాబ్ లో బీజేపీ బలోపేతమవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దౌత్యాధికారిగా పనిచేశానని సంధు తెలిపారు.
మోడీ నాయకత్వ పటిమను చూసి ప్రపంచ ప్రఖ్యాతి కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు సంధు. .అతిపెద్ద సెమీకండక్టర్ కంపెనీ గుజరాత్ లో పెట్టుబడులు పెడుతోందని, ఇంధన రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ 'ఫస్ట్ సోలార్' చెన్నైలో పెట్టుబడులు పెడుతోందని సంధు గుర్తు చేశారు. ప్రధాని మోడీ రూపొందించిన నూతన విద్యావిధానం నైపుణ్యాలపై దృష్టి సారించిందని, ఐఐటీల్లో అంతర్జాతీయ సంస్థలతో టూ ప్లస్ టూ, త్రీ ప్లస్ వన్ భాగస్వామ్యం లాంటి అంశాలతో పురోగతి ఎలా జరుగుతోందో వివరించారు సంధు.
దేశానికి సేవ చేసేందుకు పార్టీలో చేరుతున్న తనను.. ప్రోత్సహించిన ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మాజీ రాయబారికి ఆయన స్వస్థలం అమృత్ సర్ లో స్థానిక బీజేపీ మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. సంధు .. పంజాబ్ లోని ప్రసిద్ధి చెందిన సముంద్రి కుటుంబానికి చెందిన వ్యక్తి. సుప్రసిద్ధ స్వతంత్ర పోరాట వీరుడు సర్దార్ తేజా సింగ్ సముంద్రి మనవడు , గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్ బిషన్ సింగ్ సముంద్రి కుమారుడు సంధు.
1963లో పంజాబ్ లో జన్మించిన సంధు 1988లో ఐఎఫ్ఎస్ లో చేరారు. ఉక్రెయిన్ లో తొలి భారత రాయబార కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ రాజకీయ, పరిపాలన విభాగాలకు అధిపతిగా సేవలందించారు. ఆయన గతంలో ఫస్ట్ సెక్రటరీగా వాషింగ్టన్ లో ఉన్నారు కూడా.