డల్లాస్ - తానా ఆద్వర్యంలో ఘనంగా జరిగిన పుస్తకమహోద్యమం!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తానా ప్రపంచ సాహిత్య సదస్సు ఆధ్వర్యంలో "పుస్తక మహోద్యమం" కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి, ఉత్సాహంగా పాల్గొని సభను జయప్రదం చేశారు. చిన్నారులు రితిక, గాయత్రిలు మధురంగా ఆలపించిన ప్రార్ధనా గీతం తో సభను ప్రారంభించారు.
ముందుగా చినసత్యం వీర్నపు, తానా “తెలుగు భాషా పరివ్యాప్తి కమిటీ” ఛైర్మన్ తన స్వాగతోపన్యాసం లో తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పించి, వీలైనంత వరకు వారితో తెలుగులో మాట్లాడాలని సూచించారు. పుస్తక మహోద్యమం గురించి మాట్లాడుతూ, గురువులు ద్వారా మనకి కొంత జ్ఞాన సంపాదన కలుగుతుందని, పుస్తక పఠనం ద్వారా దానిని ఇంకా రెట్టింపు చేసుకోవచ్చని తెలియజేశారు. పద్యాలు, అవధానాలు మన తెలుగు వారికే సొంతం అని, మరి ఏ భాషకి అటువంటి అదృష్టం లేదని గుర్తు చేశారు.
తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన వివిధ శాఖలలో పనిచేస్తున్న తానా సభ్యులను సభకు పరిచయం చేసి, మంచి కార్యక్రమాలతో అన్ని సంస్థలతో కలసి పనిచేసేందుకు తానా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని చెప్పారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ పుస్తకాలను కొని బహుమతులు గా ఇచ్చే సంప్రదాయాన్ని ప్రోత్సహించడం, ముఖ్యం గా పిల్లలకు చిన్నప్పటినుండే పుస్తక పఠనం పై ఆసక్తి గల్గడానికి వారికి మంచి పుస్తకాలను పరిచయం చెయ్యాలని, ‘పాతికవేల పుస్తకాలు పాటకుల చేతుల్లోకి’ అనే నినాదంతో ప్రారంభించిన ఈ అక్షర యజ్ఞానికి విశేష స్పందన లభిస్తోందని, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.
డా. ప్రసాద్ గారు తానా కళాశాల చైర్మన్ రాజేష్ అడుసుమిల్లి గారికి సభకు పరిచయం చేసి, కళాశాల నిర్వహిస్తున్న కార్యక్రమాలను సభకు తెలియజేయవలసిందిగా కోరారు.
తానా కళాశాల చైర్మన్ డా. రాజేష్ అడుసుమిల్లి మాట్లాడుతూ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తో తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర చొరవతో తానా ప్రారంభించిన సంగీతం, నృత్య తరగతులకు విశేష స్పందన లభిస్తోందని ఇప్పటికే కొన్ని వందల మంది పిల్లలు విశ్వవిద్యాలయ స్థాయి తరగతుల్లో నమోదు అయ్యారని అన్నారు.
తానా పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల మాట్లాడుతూ పాఠశాలలో పిల్లలకు సులభతరంలో తెలుగు నేర్చుకునే విధంగా పాఠ్యాంశాలను రూపొందించామని, ఉపాధ్యాయులు కూడా పిల్లలకు అర్ధమయ్యే రీతిలో నేర్పిస్తున్నారు అని చెప్పారు. ఇప్పటికే అమెరికా అంతటా, విదేశాలలో కూడా తానా పాటశాలలో వేల సంఖ్యలో పిల్లలు చేరి తెలుగు నేర్చుకుంటున్నారని అన్నారు.
చిన్నారులు సాహితీ వేముల, సింధూర వేముల ఆలపించిన ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట...అనే గీతం అందరి మన్ననలు పొందింది. వారిని ప్రోత్సహిస్తున్న తలిదండ్రులు లెనిన్ వేముల, కిరణ్మయి లకు అభినందనలు తెలియజేశారు. లెనిన్ వేముల కొన్ని మధురమైన తెలుగు పద్యాలను ఆలపించి అందరిని ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమం లో వందలాదిమంది పిల్లలకు తానా బృంద సభ్యులు బాల సాహిత్యం పుస్తకాలను, పెద్దలకు ఉపయోగ పడే అనేక పుస్తకాలను పెద్దలకు బహుమతులుగా అందించారు.
ఎం.వి.ఎల్ ప్రసాద్, డా. సుధా కలవగుంట, డా. ఊరిమిండి నరసింహారెడ్డి, డా. గన్నవరపు నరసింహమూర్తి, డా. పూదూర్ జగదీశ్వరన్, టాంటెక్స్ అధ్యక్షులు లక్ష్మి పాలేటి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, స్వర్ణ అట్లూరి, డా. సత్యం ఉపద్రష్ట, లోకేష్ నాయుడు, పరమేష్ దేవినేని, సాంబయ్య దొడ్డ, శ్రీకాంత్ పోలవరపు, వెంకట ప్రమోద్, రాజేష్ అడుసుమిల్లి, మురళి వెన్నం, మధుమతి వైశ్యరాజు, కళ్యాణి తాడిమేటి, వీర లెనిన్, సురేష్ కాజ, లెనిన్ వేముల, సురేష్ మండువ, బసవి ఆయులూరి, వెంకట్ తాడిబోయిన మొదలైన పలువురు పురప్రముఖులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
అడయార్ ఆనంద్ భవన్ అధినేత రమేష్ గాదిరాజు గారికి, వివిధ ప్రసార మాధ్యమాలకు, వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు సతీష్ కొమ్మన కృతఙ్ఞతలు తెలియజేశారు.