గవర్నర్ వర్సెస్ తమిళనాడు సర్కార్..
తమిళనాడు విద్యుత్, ఎక్సెజ్ శాఖమంత్రి సెంథిల్ బాలాజీ వ్యవహారంతో మరోసారి గవర్నర్ వ్యవస్థ చర్చనీయాంశమైంది. మూడు రోజుల క్రితం మనీలాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.అస్వస్థతకు గురికావడంతో ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయనకు బైపాస్ సర్జరీకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆయనను ఆస్పత్రిలోనే అధికారులు విచారించనున్నారు. కేంద్రం తమను నేరుగా ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని ఇప్పటికే సీఎం స్టాలిన్ ఆరోపించారు.
సెంథిల్ బాలాజీ బైపాస్ సర్జరీ దృష్ట్యా ఆయన వద్ద ఉన్న విద్యుతశాఖను ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసుకు, ఎక్సైజ్శాఖను గృహ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎస్.ముత్తుస్వామికి అదనంగా కేటాయించాలంటూ సీఎం స్టాలిన గురువారం గవర్నర్కు సిఫారసు చేశారు. ఇందుకు గవర్నర్ అంగీకరించినప్పటికీ.. సెంథిల్ బాలాజీ క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటుండడం, జ్యుడీషియల్ కస్టడీలో ఉండడంతో శాఖలేని మంత్రిగా ఆయన్ని కొనసాగించడానికి నిరాకరించారని గవర్నర్ ముఖ్య కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు.
గవర్నర్ ప్రకటనతో స్టాలిన్ సర్కార్ కంగుతింది. ఆయనను శాఖలేని మంత్రిగా ఉంచేందుకు గవర్నర్ ఆర్ ఎన్ రవి అంగీకరించకపోవడంతో.. ఏకంగా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది. విద్యుత్, ఎక్సైజ్ శాఖలను ఇతరమంత్రులకు కేటాయించడంతో పాటు సెంథిల్ బాలాజీని శాఖలేని మంత్రిగా ఆర్డినెన్స్ లో తెలిపింది.ఈవిధంగా గవర్నర్ నిర్ణయంపై డీఎంకే ప్రభుత్వం తన పంతం నెగ్గించుకున్నట్లైంది.
అయితే మొదటి నుంచి గవర్నర్ రవి, స్టాలిన్ సర్కార్ మధ్య సత్సంబంధాలు లేవు. 21 బిల్లులను గవర్నర్ తనకార్యాలయంలో పెండింగులో పెట్టడంపైనా గతంలో.. స్టాలిన్ , మంత్రులు మండిపడ్డారు . ఆతర్వాత తమిళనాడు పేరును తమిళగంగా మార్చాలంటూ అసెంబ్లీలో ప్రకటించడంపైనా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. గవర్నర్ వెనక్కు తగ్గకపోవడంతో అసెంబ్లీ నుంచి బాయ్ కాట్ చేశారు. ఇప్పుడు సెంథిల్ బాలాజీ వ్యవహారంతో మరోసారి ఇరుపక్షాలు .. వార్ కు దిగినట్లైందని చెప్పొచ్చు.