సింహాద్రి రీరిలీజ్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్
ఒక సంవత్సరం నుంచి టాలీవుడ్ లో రీరిలీజ్ ల గోల ఎక్కువైపోయింది.కొత్త సినిమాల తరహాలో అడ్వాన్స్ బుకింగ్స్ చేయడం, ఫ్యాన్స్ గోలలు, కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు, సంబరాలు ఇలా నానా రచ్చ చేస్తున్నారు. ఇదంతా చూడటానికి కొంచెం వింతగా ఉన్నా, ఈ యుఫోరియాని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రీరిలీజ్ ల విషయంలో రికార్డుల కోసం గొడవలు కూడా జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు వీటికి ఉన్న క్రేజ్ గురించి.
ఇప్పటికే మహేష్, పవన్ ఫ్యాన్స్ ఈ హంగామాను పీక్స్ కు తీసుకెళ్లగా ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు టైమొచ్చింది. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సింహాద్రి సినిమా రీరిలీజ్ కు ప్లాన్ చేశారు ఫ్యాన్స్. దీని కోసం దాదాపు రెండు నెలల నుంచి భారీ ఎత్తున ప్లానింగ్ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటూ యూఎస్ లో కూడా భారీగా షోలు ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
ఇందుకోసం ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుక్సింగ్స్ మంచి ఊపుమీదున్నాయి. ఇంతవరకు బానే ఉంది కానీ అసలు విషయం ఏంటంటే ఓ రీరిలీజ్ మూవీకి మొదటిసారిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తున్నారు ఫ్యాన్స్. మామూలుగా కొత్త సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే జేఆర్సీ కన్వెన్షన్లోనే ఈ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. ఈ నెల 17న ఈ వేడుక జరగబోతుంది. ఈ హంగామా, హడావిడి చూస్తుంటే రీరిలీజ్ రికార్డులన్నింటినీ సింహాద్రి బ్రేక్ చేయడం ఖాయంలా అనిపిస్తోంది.