ఉగ్రవాదులను వాళ్ల ఇంట్లో దూరి మట్టుబెడుతున్నాం: ప్రధాని మోదీ
భారతదేశానికి హాని తలపెట్టేందుకు ప్రయత్నించే ఉగ్రవాదులను వెంటాడి హతమారుస్తామని దేశ ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఒకప్పుడు దేశంలో ఎప్పుడూ బలహీనమైన ప్రభుత్వం ఉండేదని, కానీ ప్రస్తుతం బలమైన ప్రభుత్వం పాలన సాగిస్తోందని మోదీ అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాడు ఉత్తరాఖండ్ చేరుకున్న ప్రధాని మోదీ.. రిషికేశ్లోని ఐడీపీఎల్ స్పోర్ట్స్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.
‘‘ఒకప్పుడు దేశంలో బలహీన ప్రభుత్వం ఉండేది. దాంతో రక్షణ వ్యవస్థతో పాటు మిగిలిన కీలక వ్యవస్థలు బలహీనంగా ఉండేవి. సైన్యం దగ్గర మంచి బూట్లు కూడా ఉండేవి కావు. ఆ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని.. శత్రువులు, ఉగ్రవాదులకు దేశంపై దాడులకు దిగేవారు. కానీ గత 10 ఏళ్లుగా దేశంలో బలమైన ప్రభుత్వం ఉంది. ఇప్పుడు సైన్యం హైటెక్ పద్ధతిలో పని చేస్తోంది. ఉగ్రవాదులు దేశం నుంచి పారిపోయినా, వారి సొంత దేశాల్లో తల దాచుకున్నా సరే.. వారిని వెంటాడి, వారి దేశంలోకి చొచ్చుకుని వెళ్లి మరీ హతమారుస్తున్నాం.’’ అంటూ పీఎం మోదీ వ్యాఖ్యానించారు.
అలాగే దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో తమ ప్రభుత్వాన్ని గెలిపించారని, తమ పనితీరును మెచ్చి మళ్లీ అధికారాన్ని కట్టబెట్టారని పేర్కొన్న ప్రధాని మోదీ.. గత 10 సంవత్సరాలలో భారతదేశాన్ని గతంలో కంటే అనేక రెట్లు బలోపేతం చేశామని, ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దామని చెప్పారు. ఆర్టికల్ 370 చట్టాన్ని రద్దు చేశామని, ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా చట్టం తెచ్చామని, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని, పేద, జనరల్ కేటగిరీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించామని తమ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక నిర్ణయాల గురించి వివరించారు.