పండుగ చేసుకున్న న్యూయార్క్ ప్రజలు.. ఎందుకో తెలుసా?
అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం కరోనా ఆంక్షలన్నీ ఎత్తేసింది. తమ రాష్ట్రంలో 70 శాతం మంది వయోజనులు కనీసం ఒక డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ కువోమో వెల్లడించారు. ఆంక్షలు తొలగిపోవడంతో ప్రజలు పటాకులు కాల్చి పండుగ చేసుకున్నారు. ఇది చెప్పుకోదగిన మైలురాయి అని, తాము మరింత చేస్తామని ఈ సందర్భంగా కువోమో తెలిపారు. వాణిజ్య సామాజిక పరంగా ఉన్న ఆంక్షలన్నింటినీ వెంటనే ఎత్తేస్తున్నట్లు న్యూయార్క్ గవర్నర్ ప్రకటించారు. అయితే అమెరికా సీడీసీ సూచనల మేరకు కొన్ని ముందు జాగ్రత్తలు చర్యలు మాత్రం కొనసాగుతాయమని చెప్పారు. థియేటర్లలో 100 మంది, జిమ్లలో 33 శాతం, రిటైయిల్ షాపులలో 50 శాతం సామర్థ్యం మాత్రమే ఉండాలన్న పారిశ్రామిక సంబంధిత ఆంక్షలను ఎత్తేశారు.
గతేడాది అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. అలాంటిది ఇప్పుడు మహమ్మారిని విజయవంతంగా కట్టడి చేసిన ఆ రాష్ట్రం ఓ చిరస్మరణీయ రోజుగా జరుపుకుంది. ఎంఫైర్ స్టేట్ బిల్డింగ్తో పాటు రాష్ట్రమంతా సంబరాలు చేసుకున్నారు.