పాకిస్తాన్ కష్టాలకు 'సైన్యమే' కారణమా...?
పాకిస్థాన్ పాలకుల్లో తమదేశ పరిస్థితిపై ఆందోళన కనిపిస్తోంది. ఇటీవలి కాలం వరకూ చీటికి, మాటికీ భారత్ పై విరుచుకుపడిన పాక్ పాలకులు... ఇప్పుడు స్వరం మార్చారు. మన దుస్ధితికి భారత్, అమెరికా కారణం కాదు.. మనకాళ్లను మనమే కాల్చుకుంటున్నామన్నారు మాజీప్రధాని నవాజ్ షరీఫ్. పొరుగుదేశం చంద్రుడిపైకి చేరుకుంటుంటే.. మనం మాత్రం భూమిపైనే నిలబడలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కారణమేంటన్న అంశంపై అందరూ దృష్టి పెట్టాలన్నారు షరీఫ్.
‘2013లో డిమాండ్ తగినట్టుగా విద్యుత్ సరఫరా లేదు. దానిని పరిష్కరించాం. ఉగ్రవాదాన్ని మట్టుపెట్టి, కరాచీలో శాంతిని పునరుద్ధరించాం. హైవేలు నిర్మించాం. చైనా-పాకిస్థాన్ ఎకానమిక్ కారిడార్ తీసుకువచ్చాం. అభివృద్ధి పరంగా కొత్త శకం ప్రారంభమైంది’ అంటూ మాట్లాడారు. అయితే తరువాత అవన్నీ మరుగున పడ్డాయన్నారు. ఇప్పటికే మూడు సార్లు పాక్ ప్రధానిగా పని చేసిన నవాజ్ షరీఫ్ నాలుగోసారి అధికారం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. మూడుసార్లు తనను అధికారం నుంచి దించేశారని సైన్యాన్ని ఉద్దేశించి విమర్శలు చేశారు.
‘మన ఆర్థిక కష్టాలకు మనమే కారణం. భారత దేశమో, అమెరికానో కారణం కాదు. 2018 ఎన్నికల్లో మనపై బలవంతపు ప్రభుత్వాన్నిరుద్దారు. దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడటంతోపాటు ఆర్థిక వ్యవస్థ దిగజారింది. సైనిక నియంతలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన సమయాల్లో న్యాయమూర్తులు వారికి మద్దతుగా నిలిచారు. వారి పాలనకు చట్టబద్ధత కల్పించారు. ప్రధానులను ఉద్వాసనకు గురిచేసిన సమయాల్లోనూ వారు ఆమోదించారు. ఇదంతా ఎందుకు జరిగిందో ఆలోచించాలి’ అని వ్యాఖ్యానించారు.
సరిగ్గా పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన తరుణంలో... నవాజ్ షరీఫ్ పాక్ గడ్డపై అడుగు పెట్టారు. అడుగు పెట్టిన తర్వాత ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. అయితే గతంలో బ్రిటన్ లో ఆశ్రయం పొందిన షరీఫ్.. ప్రస్తుతం తమ్ముడు షాబాజ్ షరీఫ్ ప్రధానిగా ఉండడంతో తిరిగి రావడానికి వీలైంది. తమ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో లీగల్ గా ఉన్న సమస్యలను .. ఏదో విధంగా పరిష్కరించుకుని స్వదేశానికి చేరుకోగలిగారు షరీఫ్. అన్నగారు వచ్చిన తర్వాత ఆయనే పార్టీని లీడ్ చేస్తారని ఇదివరకే షాబాజ్ ప్రకటించారు కూడా.