ప్రచార బరిలో బాలయ్య..
2024 ఎన్నికలు అన్నిపార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రతిష్టాత్మకం అనడం కన్నా డూ ఆర్ డై సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గెలిచే పార్టీకి అన్ని హంగులు సమకూరతాయి. కానీ ఓడితే మాత్రం ఐదేళ్లపాటు చాలా కష్టం..అందుకే అన్ని పార్టీలు స్టార్ క్యాంపైనర్లను పెట్టి మరీ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఇందులో జనసేనకు అధినేతే స్టార్ కాబట్టి, ఆయనతో పాటు పలువురు నటులు ప్రచార బరిలోకి వస్తున్నారు. ఇక టీడీపీకి మొదటి నుంచి సినీవాసనలు ఉండడంతో.. పలువురు ఆపార్టీ తరపున పోటీ చేశారు. ప్రచారం నిర్వహించారు.
ఇప్పుడు తొలిసారిగా రాష్ట్రవ్యాప్త పర్యటనకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. హిందూపురంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు బాలకృష్ణ. ఇప్పటివరకూ తన నియోజకవర్గానికే పరిమితమైన బాలయ్య..మారిన పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. సాదారణంగానే బాలయ్య అంటే మాస్.. మరి అలాంటి బాలకృష్ణ పర్యటనకు సిద్ధం కావడంతో టీడీపీ, బాలయ్య అభిమానుల్లో సందడి నెలకొంది. బాలకృష్ణ ఈ నెల 12వ తేదీ శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ రావాలి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం, మిత్రపక్షాల అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. సైకిల్ రావాలి బస్సు యాత్రను ప్రారంభించే ముందు బాలయ్య శుక్రవారం సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని నరసింహ స్వామి ఆలయంలో పూజలు చేయనున్నారు. ఈ నెల 12న కదిరి, పుట్టపర్తి, అనంతపురం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. మరుసటి రోజు అనంతపురం జిల్లా శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఈ నెల 14న బనగానపల్లిలో నంద్యాలలో పర్యటించి ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.
ఏప్రిల్ 15న పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించే ఈ యాత్ర అదే రోజు కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, కర్నూలు సెగ్మెంట్ల మీదుగా సాగుతుంది. ఈ నెల 16న బాలకృష్ణ బస్సుయాత్ర కోడుమూరు నియోజకవర్గంలోకి ప్రవేశించి మండల కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాలైన కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం మీదుగా సాగుతుంది. కర్నూలు జిల్లా పత్తికొండ, ఆలూరులో తన యాత్రను కొనసాగించి 17న అనంతపురం జిల్లా రాయదుర్గంలోకి ప్రవేశిస్తారు. నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగుతుండటంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో టీడీపీ ప్రచారం హోరెత్తనుంది.