ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా 'ఖర్గే'..?
ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత అలయెన్స్ పార్టీలు .... హస్తంపై సునిశిత విమర్శలు గుప్పించాయి. దీంతో కూటమి నుంచి పార్టీలు జారిపోతున్నాయంటూ ప్రచారం జరిగింది. అయితే పార్లమెంటులో స్మోక్ ఘటన తర్వాత విపక్ష పార్టీలు ... ప్రధాని,హోంమంత్రి ప్రకటన చేయాలంటూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నాయి. దీంతో ఏకంగా 151 మంది విపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఈ ఘటన తర్వాత ఢిల్లీలో సమావేశమైన ఇండియా కూటమి నేతలు.. కీలక ప్రతిపాదన చేశారు. ఇప్పటివరకూ తమనేతే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారంటూ కొందరు నేతలు లీకులిచ్చారు. అలాంటిది ఈ ఘటన తర్వాత కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఉండాలంటూ.. సాక్షాత్తూ మమత, కేజ్రీవాల్ తదితరులు ప్రతిపాదించారు. అయితే ఈప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చారు ఖర్గే. ముందు ఎన్నికల్లో గెలుపుకోసం ప్రయత్నిద్దాం.. ఆతర్వాతే ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై ఆలోచిద్దామంటూ క్లారిటీ ఇచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలు, ఉమ్మడి ప్రచారం, పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చించారు.
పార్లమెంటులో చొరబాట్ల గురించి ప్రశ్నించిన ప్రతిపక్ష కూటమికి చెందిన 151 మంది ఎంపీలను దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా సస్పెండు చేసిన మోడీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 8 నుంచి 10 వరకూ ఉమ్మడి ర్యాలీలను చేపట్టాలనే నిర్ణయానికొచ్చారు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై తొలుత రాష్ట్ర స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే దిల్లీ స్థాయిలో నేతలు చర్చిస్తారు. జనవరి రెండో వారానికల్లా సీట్ల సర్దుబాటును పూర్తి చేయనున్నారు. ఈ నెలాఖరుకు రాష్ట్రాల స్థాయిలో ఈ ప్రక్రియను పూర్తి చేసి తుది నిర్ణయాన్ని జనవరిలో తీసుకోవాలనే ప్రతిపాదనకు అంతా అంగీకరించారు.
ఒకవైపు పార్లమెంటు నడుస్తుంటే ప్రధాని అహ్మదాబాద్లో జరిగే భవన ప్రారంభం కోసం, తన సొంత నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల కోసం వెళ్లారు. దేశ వ్యాప్తంగా ప్రసంగాలు చేసేవారు సభ ముందుకొచ్చి ఎందుకు మాట్లాడటం లేదో తెలియడం లేదన్నారు ఖర్గే. ఆయన ప్రజాస్వామ్యాన్ని ఖతం చేసే ఉద్దేశంతో ఉన్నారు. అందుకే చరిత్రలో ఎన్నడూలేనంత మందిని ఈసారి సస్పెండు చేశారు. దీనిపై ప్రజల్లోకి వెళ్లి పోరాడతాం’ అని ఖర్గే పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధాని మోడీకి ఈ దేశాన్ని తాను తప్ప ఇంకెవరూ కాపాడలేరన్న గర్వం వచ్చింది. అందుకే మేం తొలుత ఇండియా కూటమి గెలుపుపై దృష్టి పెడుతున్నాం. కలిసికట్టుగా పోరాడి గెలుస్తాం. ఎన్నికల తర్వాత ఎంపీలు ప్రజాస్వామ్యబద్ధంగా నేతను ఎన్నుకుంటారు’ అని బదులిచ్చారు.
మమత ప్రతిపాదనలివే..
సీట్ల సర్దుబాటుపై మమతా బెనర్జీ ఒక ఫార్ములాను ప్రతిపాదించారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 300 సీట్లలో పోటీ చేయాలని సూచించారు. ఉత్తర్ ప్రదేశ్లో అఖిలేశ్, ఢిల్లీ, పంజాబ్లలో కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్లో తాను కెప్టెన్లుగా ఉంటామని ఆమె ప్రతిపాదించారు. మరోవైపు...మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు కోసం రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎంలు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్, ఎంపీ ముకుల్ వాస్నిక్, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, సీనియర్ నాయకుడు మోహన్ ప్రకాశ్ నేతృత్వంలో ‘నేషనల్ అలయన్స్ కమిటీ’ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ముకుల్ వాస్నిక్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో ఈ కమిటీ చర్చించి సీట్ల సర్దుబాటు అంశాన్ని ఒక కొలిక్కి తేనుంది.