బిహార్లో ఫైనలైన సీట్ షేరింగ్
లోక్సభ ఎన్నికల కోసం బిహార్లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య సీట్ల లెక్క తేలిపోయింది. దాదాపు 15 రోజులుగా ఈ పార్టీల మధ్య సీట్ల పంపకం పెద్ద తలనొప్పిగా మారింది. కొన్ని సీట్ల విషయంలో అయితే ఏకంగా వివాదాలు కూడా తలెత్తాయి. అయితే ఎట్టకేలకు అన్ని పార్టీల మధ్య సయోధ్య కుదిరింది. మూడు పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఓ ఒప్పందానికి వచ్చేశాయి.
సదరు ఒప్పందం ప్రకారం.. మొత్తం 40 లోక్సభ స్థానాల్లో 26 స్థానాల్లో అర్జేడీ పోటీ చేయనుండగా.. 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, మిగిలిన 5 నియోజకవర్గాల్లో లెఫ్ట్ పార్టీలు పోటీ చేయనున్నాయి. కథియార్, కిషన్ గంజ్, పట్నా సాహిబ్, ససారాం, భాగల్పూర్, వెస్ట్ చంపారన్, ముజఫర్పూర్, సమస్తిపూర్, మహరాజ్ గంజ్ సీట్లను కాంగ్రెస్కు కేటాయించారు. బెగుసరాయ్, ఖగారియా, అర్హ్, కరకట్, నలంద స్థానాల నుంచి వామపక్ష అభ్యర్థులు పోటీ చేయనున్నారు. మిగిలిన చోట్ల ఆర్జేడీ తమ అభ్యర్థులను పోటీలో నిలపనుంది. బిహార్లో మొత్తం 40 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఈ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుండగా, రెండో దశ 26న, మూడో దశ మే 7న, నాలుగో దశ 13న, ఐదో దశ 20న, ఆరో దశ 25న, ఏదో దశ జూన్ 1న జరగనున్నాయి. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.
కాగా.. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున బీజేపీ అత్యధికంగా 17 స్థానాల్లో గెలుపొందగా.. ఆ తర్వాత 16 స్థానాల్లో జేడీయూ విజయం దక్కించుకుంది. చివరిగా చిరాగ్ పాస్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఎల్జేపీ 6 చోట్ల గెలుపు జెండా ఎగరేసింది. అయితే విపక్ష పార్టీలకు మాత్రం పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. కాంగ్రెస్ ఒకే ఒక్క నియోజకవర్గంలో గెలవగా.. ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలు ఒక్క స్థానంలో కూడా విజయం దక్కించుకోలేకపోయాయి. ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమి మధ్య కొన్ని రోజుల ముందే సీట్ల సర్దుబాటు పూర్తయింది. దాని ప్రకారం.. ఈ దఫా ఎన్నికల్లో కూడా బీజేపీ 17, జేడీయూ 16, ఎల్జేపీ 5 చోట్ల, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ ఆవామీ మోర్చా, లోక్ సమత పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) చెరో స్థానంలో పోటీ చేయనున్నాయి.