‘‘రాష్ట్రం విడిపోకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవాడా?’’ : జగ్గారెడ్డి ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తేనే కేసీఆర్కు సీఎం అయ్యే అదృష్టం దక్కిందంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి, ఇప్పుడు తెలివిగా తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందంటూ కేసీఆర్ అడుగుతున్నారని, ‘‘అసలు రాష్ట్రం విడిపోకుంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవాడా?’’ అంటూ జగ్గారెడ్డి ఫైరయ్యారు. గాంధీభవన్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన జగ్గారెడ్డి.. పదేళ్లు అధికారంలో ఉండి అన్ని వ్యవస్థలను కేసీఆర్ అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. ఇక ఇప్పుడు అధికారం కోల్పోవడంతో కేసీఆర్ మైండ్ సరిగా పని చేయడం లేదని, అసలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ ఆగమయ్యే వాడని విమర్శించారు.
రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ ఇద్దరూ ఒకే విధానాన్ని అవలంబిస్తున్నారన్న జగ్గారెడ్డి.. ఇందిరమ్మ పరిశ్రమలు పెడితే, మోదీ వాటిని అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు, గిరిజనులకు భూములు పంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది, ఇందిరమ్మదేనని వ్యాఖ్యానించిన ఆయన.. కేసీఆర్ కానీ, మోదీ కానీ అంగుళం నేలైనా పేదలకు ఇచ్చారా..? అంటూ ప్రశ్నించారు. బీహెచ్ఈఎల్, ఐడీపీఎల్, హెచ్ ఏఎల్, హెచ్ ఎంటీ, బీడీఎల్, హెచ్ సీఎల్, ఈసీఐఎల్, డీఆర్డీఎల్ లాంటి సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిందని, ఇది ఇప్పుడున్న యువత తెలుసుకోవాలని, కాంగ్రెస్ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి రోజులు వస్తాయని ఆయనన్నారు.