పీఎం అభ్యర్థిగా రాహుల్..?
విపక్షకూటమి -ఇండియా పీఎం అభ్యర్థి రాహులేనా? బెంగుళూరు సమావేశంలో విపక్ష పార్టీలన్నీ రాహుల్ మంత్రాన్ని జపించాయా? లాలూ ప్రసాద్ నుంచి మమత వరకూ అందరి నుంచి రాహుల్ నాయకత్వానికి అంగీకారం లభించిందా? తాను బెంగాల్ కే పరిమితం కావాలని మమత భావిస్తున్నారా? ప్రస్తుతం బెంగుళూరులో జరిగిన పరిణామాలు చూస్తుంటే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. తమకు అధికారం ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యమని కాంగ్రెస్ చెబుతున్నా.. విపక్షాలు మాత్రం రాహుల్ వైపే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
నిన్నటి వరకూ విపక్షాల ఐక్యతపై అనేక ప్రశ్నలు వినిపించాయి. అనైక్యత కూటమి ఎలా ముందుకెళ్లగలదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ మీటింగ్ తో వాటన్నింటికీ సరైన సమాధానమిచ్చినట్లైంది. మరీ ముఖ్యంగా రాహుల్ నాయకత్వంలో రోజురోజుకూ బలోపేతమవుతున్న కాంగ్రెస్ పై .. మిత్రపక్షాల అంచనాలు పెరిగిపోతున్నాయి. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ సహా పలువురు సీనియర్లు రాహుల్ వైపు చూస్తున్నారు. మొన్నటివరకూ కాంగ్రెస్ ను బీ టీమ్ గా చూసిన మమత .. తన స్టాండ్ మార్చుకున్నట్లు స్పష్టమైంది. ఇక డీఎంకే సహా పలు ప్రాంతీయ పార్టీలు.. ప్రధాని అభ్యర్థి రేసులో ఉండడం లేదు. ఇక చివరగా చెప్పాల్సింది నితీష్ కుమార్ గురించి. ఆయన మాత్రమే ప్రధాన అభ్యర్థి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నితీష్ .. అభ్యర్థిత్వానికి ఎన్నిపార్టీలు మద్దతిస్తాయన్నది అనుమానంగా మారింది.
భారత్ జోడో యాత్రతో రాహుల్... జనాలను కలుసుకుంటూ ముందుకు సాగారు. తనపై వస్తున్న విమర్శలను సైతం పట్టించుకోకుండా.. తానేమి అడగదలచుకున్నారో వాటిని ప్రస్తావిస్తూ యాత్ర చేశారు. ఆ తర్వాత యాధృచ్చికమో, కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగిందో తెలియదు కానీ.... హిమాచల్ ప్రదేశ్, కర్నాటకల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగించింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవ్నికైన ఖర్గే సైతం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యలపైనా ఫోకస్ పెడుతున్నారు. ఈపరిణామాలు కాంగ్రెస్ మిత్రపక్షాల వైఖరిలోనూ కాసింత మార్పు తెచ్చాయని చెప్పకతప్పదు.
ఇన్నాళ్లూ తీరు,తెన్నూ లేని విపక్షాలు ఇప్పుడు ఏకమవుతున్నాయి. అంతేకాదు.. తమ లక్ష్యమేంటో అధికార కూటమికి సూటిగా చెప్పేశాయి. మోడీ అంటే భయం లేదని.. ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికార ఎన్డీఏకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు ఎన్డీఏ కూటమి .. ఇంకా ఎలాంటి వ్యూహాలు రచిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.