ఇళ్ల రిజిస్ట్రేషన్లలో పెరిగిన రాబడి
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం జోరు మీదుంది. 2021 ఏడాదికి సంబంధించి దేశంలోనే ఎక్కువ ఇళ్లు అమ్ముడైన మెట్రో సిటీగా మొదటి స్థానంలో నిలిచింది. ఏడాది చివరన డిసెంబరులో అమ్ముడైన ఇళ్ల యూనిట్ల సంఖ్యలో తగ్గుదల కనిపించినా రిజిస్ట్రేషన్ వ్యాల్యూ మాత్రం తగ్గలేదు. నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడిరచిన వివరాల ప్రకారం హైదరాబాద్ నగర పరిదిలో 3,931 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్ విలువ ఏకంగా రూ.2,340 కోట్లుగా నిలిచింది. గతేడాది ఇదే నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో పోల్చితే 16 శాతం వృద్ధి కనిపించింది. డిసెంబరులో అమ్ముడైన ఇళ్లలో అత్యధికం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి 2,693, హైదరాబాద్ 1,180, సంగారెడ్డి 66 ఇళ్లుగా ఉన్నాయి. గత సంవత్సరం హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం 44,278 ఇళ్ల రిజిస్ట్రేషన్ జరగగా వాటి విలువ రూ.25,330 కోట్లుగా ఉంది. కరోనా సంక్షోభం చుట్టుముట్టినా రియల్ ఎస్టేట్ రంగం స్థిరంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది.
ఆఫీస్ స్పేస్లో హైదరాబాద్కు ఫస్ట్ ప్లేస్
ఆఫీస్ స్పేస్ విషయంలో హైదరాబాద్ నగరంపైనే పెట్టుబడిదారులు మోజు చూపిస్తున్నారు. దాంతో ఇక్కడి ఆఫీస్ స్పేస్కు మంచి డిమాండ్ కనిపిస్తూనే ఉంటుంది. వర్క్ ఫ్రం హోమ్ కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త ఆఫీస్ స్పేస్ నిర్మాణం విషయంలో డెవలపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నప్పటికీ ఇక్కడ డిమాండ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం నగరంలో 8.85 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ రెడీగా ఉందని చెబుతున్నారు. కాగా గత సంవత్సరం హెచ్2లోని ఆఫీస్ స్పేస్ లావాదేవీలలో 35 శాతం తయారీ రంగం ఆక్రమించింది. ఐటీ, ఫార్మాతో పాటూ తయారీ రంగం కూడా హైదరాబాద్ను తమ స్థావరంగా ఎంచుకుంది.
గృహాలకు డిమాండ్..
హైదరాబాద్లో గృహాల విక్రయాలలో ఐటీ ఉద్యోగుల వాటానే ఎక్కువగా ఉంటుంది. కరోనా తర్వాతి నుంచి ఐటీ, ఫార్మా మినహా అన్ని రంగాలు కొంత ప్రభావితమయ్యాయి. నగర మార్కెట్లో ఈ రెండు రంగాలు బాగుండటంతో గృహ విక్రయాలకూ ప్రభావితం కాలేదు. ఇంకా చెప్పాలంటే కరోనా తర్వాత ఇంటి అవసరం ఇంకా ఎక్కువగా పెరిగింది. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్లు కొనసాగుతున్న నేపథ్యంలో విస్తీర్ణమైన గృహాలు, వ్యక్తిగత గృహాలకు మరింత డిమాండ్ ఏర్పడింది.
పశ్చిమ హైదరాబాద్ జోరు..
మొదట్నుంచి నగర రియల్టీ మార్కెట్కు ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాలుగా కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటివి పేరు తెచ్చుకున్నాయి. గత సంవత్సరం కూడా లాంచింగ్ అయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో 64 శాతం వెస్ట్ జోన్లోనే ఎక్కువగా ప్రారంభమయ్యాయి. కోకాపేట, పీరంచెరు, గోపన్పల్లి, నల్లగండ్లలో ఎక్కువగా నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విక్రయాలలో కూడా పశ్చిమ హెదరాబాద్ జోరు కొనసాగింది. గతేడాది విక్రయమైన యూనిట్లలో 60 శాతం ఈ జోన్లోనే జరిగాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్ రాంగూడలోని కార్యాలయా లకు దగ్గరగా ఉండాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు. 23 శాతం రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న గృహాలు, 48 శాతం రూ.50 లక్షల నుంచి రూ.కోటి, 30 శాతం రూ.కోటిపైన ధర ఉండే యూనిట్లు అమ్ముడుపోయాయి.