హ్యుందాయ్ నుంచి ఎగిరే ట్యాక్సీ..
సిటీ ప్రయాణం ఓరకంగా చెప్పాలంటే నరకమే. ట్రాఫిక్ కష్టాలతో జనం ఉస్సూరనడం కామనైంది. ఎన్నిరకాల ట్రాన్స్ పోర్టు సదుపాయాలు వచ్చినా.. ట్రాఫిక్ కష్టాలు తీరడం లేదు. ఇలాంటి తరుణంలో సిటీలో ఈజీ ట్రావెలింగ్ కు అనుకూలమైన ఎగిరే విద్యుత్ ట్యాక్సీ ఆవిష్కృతమైంది. అమెరికాలోని లాస్ వెగాస్ వేదికగా జరిగిన 2024 కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో హ్యుందాయ్ కంపెనీ.. ఈ ఎగిరే ట్యాక్సీని ఆవిష్కరించింది.
నిట్టనిలువుగా ల్యాండింగ్, టేకాఫ్ చేయగల సామర్థ్యం ఉన్న ఈ ట్యాక్సీని హ్యుందాయ్ మోటార్ గ్రూప్నకు చెందిన అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ కంపెనీ సూపర్నల్ తయారు చేసింది. సిటీలో రోజువారీ కార్యకలాపాలకు అంటే 25 నుంచి 40 మైళ్ల దూరం ప్రయాణించేందుకు ఇది పనికొస్తుందని కంపెనీ వివరించింది. తక్కువ శబ్దంతో: ఎస్-ఏ2గా పిలుస్తున్న ఈ ఎగిరే ట్యాక్సీ గంటకు 120 మైళ్ల (193 కి.మీ) వేగంతో దూసుకెళ్లగలదు. 1500 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. పైలట్, నలుగురు ప్యాసింజర్లకు ఇందులో చోటుంది. విద్యుత్ ప్రొపల్షన్ ఆర్కిటెక్చర్ ఫీచర్తో వస్తున్న ఈ ట్యాక్సీకి ఎనిమిది రోటర్లు ఉంటాయి. వర్టికల్ ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో ఇది 65 డెసిబుల్స్; గాల్లో ఎగిరే సమయంలో 45 డెసిబుల్స్ శబ్దం మాత్రమే వెలువడుతుంది.
ఆకట్టుకునే డిజైన్తో పాటు భద్రత పైనా కంపెనీ ఫోకస్ పెట్టింది. ట్యాక్సీ డిజైన్ కోసం హ్యుందాయ్ మోటార్ గ్రూప్ డిజైనర్లతో జట్టు కట్టింది. సూపర్నల్ గాల్లో ఎగరడానికి అనుకూలంగా ఉండటం సహా ఆకట్టుకునేలా కనిపించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యంపై ప్రధానంగా దృష్టి సారించి ఈ ట్యాక్సీని అభివృద్ధి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రపంచస్థాయి విమానయాన ప్రమాణాలకు అనుగుణంగా ఈ ట్యాక్సీలో ఫీచర్లు ఉన్నాయని తెలిపింది.