దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో.. ఈ కార్ రేసింగ్
తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్ములా ఈ-రేసుకు వేదిక కానుంది. ఫార్ములా వన్కు ప్రత్యామ్నాయంగా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ఈ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే పారిస్, రోమ్, లండన్, హాంకాంగ్, న్యూయార్క్, బెర్లిన్ తదతిర 18 నగరాలు వేదికగా ఉండగా, మరో 60 నగరాలతో పోటీపడి కొత్త వేదికగా భారత్ నుంచి తొలిసారిగా హైదరాబాద్కు ఈ అవకాశాన్ని దక్కింకుంది. నవంబర్ 22 నుంచి ఫిబ్రవరి వరకు ఫార్ములా ఈ రేసు పోటీలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయని, హైదరాబాద్లో పోటీలు జరిగే తేదీలను త్వరలోనే నిర్వాహకులు ప్రకటిస్తారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు.
నెక్లెస్రోడ్, సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్, హుస్సేన్సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల ఈ రేసింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వాడకాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పినాకిల్ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ పేరిట జరిగే ఫార్ములా ఈ రేసుకు హైదరాబాద్ను వేదికగా ఎంపిక చేస్తూ అంతర్జాతీయ వాహన సమాఖ్య ఫార్మలా-ఈ తో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఒప్పందం కుదుర్చుకుంది.