రియల్ రంగంలో హైదరాబాద్ మెట్రో రైలు
హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ సంస్థ మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి కావడంతో.. రెండో దశపై దృష్టి కేంద్రీకరించింది. ఇందుకోసం అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకుంటున్నది. మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా గతంలో ప్రభుత్వం కేటాయించిన భూములను, వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థలాలను సద్వినియోగం చేసుకుంటూ ఆదాయం పొందేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉప్పల్ ప్రాంతంలో ఉన్న మెట్రో భూములను 42 ఎకరాలను లేఅవుట్గా అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తున్నది. ఇప్పటికే ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో ఉన్న 42 ఎకరాలలో చేపట్టే లేఅవుట్ కోసం స్థలాన్ని చదును చేసి అక్కడ ఉన్న చెట్లను మరో చోటకు తరలించే పనులు చేపట్టింది. ఇప్పటికే హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉప్పల్ మెట్రోరైలు డిపో చుట్టు పక్కల ప్రాంతాల్లోని సుమారు 400 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లో గజం ధర రూ. 50 నుంచి 60 వేల వరకు పలుకుతున్నది. ఈ లెక్కన మెట్రోకు చెందిన 42 ఎకరాలను రియల్ ఎస్టేట్ వెంచర్ అభివృద్ధి చేసి ప్లాట్లను విక్రయిస్తే సుమారు రూ.600 కోట్లకు పైగానే వస్తుందని భావిస్తున్నామని మెట్రో అధికారి ఒకరు తెలిపారు.
మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా మూడు కారిడార్ల పరిధిలో సుమారు 69 కి.మీ మేర రైళ్ల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో చేపట్టిన ఈ ప్రాజెక్టును పూర్తిగా ప్రైవేటు రంగ సంస్థ ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ నిర్వహిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) సంస్థ పర్యవేక్షణకే పరిమితమైంది. మరోవైపు తమకు అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను దీర్ఘకాలం లీజుకు ఇచ్చి ఆదాయం పొందాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే మెట్రో కారిడార్-3 మార్గంలోని జూబ్లీహిల్స్- మాదాపూర్ మార్గంలో కావూరి హిల్స్ రిజర్వాయర్ వద్ద లుంబినీ ఎన్క్లేవ్ ప్రాంతంలో 2990 గజాలు, మాదాపూర్ నీరూస్ ఎదురుగా 2000 గజాలు, జూబ్లీహిల్స్ చెక్పోస్టు మెట్రో రైల్వేస్టేషన్ దగ్గర 1210 గజాల స్థలంలో వ్యాపారాలు చేసుకునేలా షెడ్లను నిర్మించేందుకు టెండర్లు పిలిచి, ఆ పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. మాదాపూర్లో హైటెక్ సిటీ ఎదురుగా ఉన్న మెట్రోస్టేషన్ వద్ద ఇప్పటికే వ్యాపార సంస్థలు నిర్వహించేందుకు నిర్మాణాలు పూర్తి కాగా, ఇతర ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందని మెట్రో అధికారులు తెలిపారు.
నగరంలోనే అత్యంత పురాతనమైన వ్యాపార కేంద్రమైన కోఠిలో సుమారు వెయ్యి గజాలకు పైగా ఉన్న స్థలంలో గ్రౌండ్ ప్లస్ 4 అంతస్థుల్లో వ్యాపార భవనాన్ని నిర్మించింది. కారిడార్-2 (జేబీఎస్-ఎంజీబీఎస్)లో భాగంగా సుల్తాన్బజార్, కోఠి ప్రాంతాల్లో భూసేకరణ సమయంలో అక్కడ వ్యాపార అవకాశాలను కోల్పోయిన వారి కోసం ప్రత్యేకంగా భవనం నిర్మించి అందుబాటులో ఉంచారు. అయితే అతి తక్కువ మందే ఇక్కడ వ్యాపారం చేసుకునేందుకు ఆసక్తి కనబరచడంతో అప్పటినుంచి ఈ భవనం ఖాళీగానే ఉంది. అయితే దాన్ని లీజుకు ఇచ్చే బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. అంతలోనే కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 22 నుంచి లాక్డౌన్ విధించడం వల్ల లీజుకు బ్రేక్ పడింది. అప్పటినుంచి సెప్టెంబర్ 7 వరకు మెట్రో రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. మళ్లీ మెట్రో సేవలు ప్రారంభం కాగా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్న తరుణంలో కోఠిలోని వ్యాపార భవనాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని మెట్రో అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.