ఖట్టర్ రాజీనామా..
హర్యానాలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ...రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసిన అనంతరం రాజీనామా చేశారు. ఆయన బాటలోనే క్యాబినెట్ మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న దుశ్యంత్ చౌతాలా సారధ్యంలోని జేజేపీతో లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు రావడం ఈ పరిస్థితికి కారణమైంది.
అయితే, ఈ తరుణంలో స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ సొతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఖట్టర్ వారసుడిగా నయబ్ సైనీని.. బీజేపీఎల్పీ సమావేశం ఎన్నుకుంది.నయబ్ సైనీ ఎన్నికల ముందు కమలదళాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. తొమ్మిది నెలల తర్వాత హర్యానాలో ఎన్నికలు జరగనున్నాయి. ఓబీసీ కులానికి చెందిన సైనీకి ఇది ఓ విషమపరీక్షగా చెప్పొచ్చు.
90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది ఎమ్మెల్యేలు అవసరం.. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి మెజారిటీ తక్కువ రావడంతో బీజేపీ, జేజేపీ (JJP) కూటమిగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. అయితే, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.