టైటిల్: సత్యదేవ్ వన్ మ్యాన్ షో 'గాడ్సే'
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ: సి కె స్క్రీన్స్
నటీనటులు: సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి, జియా ఖాన్, షిజు అబ్దుల్ రషీద్, బ్రహ్మాజీ, నోయెల్ తదితరులు
స్వరాలు (రెండు పాటలు): సునీల్ కశ్యప్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : శాండీ అద్దంకి
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం, నిర్మాత: సి. కల్యాణ్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి
విడుదల తేది: 17.06.2022
విభిన్న కథా చిత్రాలతో అలరించే యంగ్ హీరోల్లో సత్యదేవ్ ముందుంటాడు. డిఫరెంట్ కాన్సెప్టులతో విభిన్నమైన రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ తాజాగా జాతి పిత మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే పేరుతో 'గాడ్సే' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో సత్యదేవ్తో 'బ్లఫ్ మాస్టర్' సినిమా తెరకెక్కించిన గోపీ గణేష్ పట్టాభి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్గా మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి నటించింది. సీకే స్క్రీన్స్ బ్యానర్పై సి. కల్యాణ్ నిర్మించిన 'గాడ్సే' ఈ రోజు శుక్రవారం అంటే జూన్ 17న విడుదల అయింది. సామాజిక అంశాలు, ప్రస్తుత వ్యవస్థ తీరు వంటి తదితర విషయాలు కథాంశంగా తెరకెక్కిన 'గాడ్సే' ప్రేక్షకులను ఏ విధంగా అలరించాడో రివ్యూలో చూద్దాం.
కథ:
పోలీసు అధికారులు, మంత్రులు, బినామీలతోపాటు కొందరు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు వరుసగా కిడ్నాప్ అవుతుంటారు. ఈ విషయం ప్రజలకు తెలిస్తే ఆందోళనకు గురవుతారని, ఇతర సమస్యలు ఏర్పడతాయని ప్రభుత్వం రహస్యంగా హ్యాండిల్ చేస్తుంది. ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఒక పోలీసు బృందాన్ని ఆదేశిస్తుంది. ఆ టీమ్లో ఏఎస్పీ వైశాలి (ఐశ్వర్య లక్ష్మి) ఉంటుంది. వీళ్లందరని రాష్ట్రానికి వచ్చిన వ్యాపారవేత్త విశ్వనాథ్ రామచంద్ర (సత్యదేవ్) కిడ్నాప్ చేశాడని తెలుసుకుంటుంది. వారందరినీ విశ్వనాథ్ రామచంద్ర ఎందుకు కిడ్నాప్ చేశాడు ? అతను ఏం చెప్పాలనుకున్నాడు ? బిజినెస్మేన్ కిడ్నాపర్ గాడ్సేగా ఎందుకు మారాడు? అనే తదితర విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల హావభావాలు:
సాధారణమైన పాత్రలతో సినీ పరిశ్రమకు పరిచయమై విలక్షణమైన పాత్రలను పోషిస్తూ నటుడిగా తనేంటో ప్రూవ్ చేసుకుంటున్న సత్యదేవ్.. గాడ్సే అనే ఓ భారీ పాత్రను చక్కగా క్యారీ చేశారు. నటుడిగా ఇప్పటి వరకు కొన్ని వైవిధ్యమైన పాత్రల్లో నటించిన ఆయన గాడ్సే తరహా పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. నటుడిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిదని చెప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే వన్ మ్యాన్ షోగా సినిమాను ముందుకు నడిపించారు సత్యదేవ్. డైలాగ్ డిక్షన్, పాత్రలోని ఇన్టెన్సిటినీ సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించిన తీరు చాలా బావుంది. ఇక స్పెషల్ ఆఫీసర్ పాత్రలో మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర లక్ష్మీ తన పాత్రకు న్యాయం చేసింది.ఇది ఆమెకు తొలి తెలుగు చిత్రం. పోలీసు పాత్రకు తగిన ఆహార్యం, డ్రెస్సింగ్ స్టైల్, యాక్టింగ్ సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి పాత్రలో సిజ్జు మీనన్.. పారిశ్రామిక మంత్రిగా థర్జీ ఇయర్స్ పృథ్వీ.. రవి ప్రకాష్.. హీరో స్నేహితులుగా నటించిన నోయల్, చైతన్య కృష్ణ తనికెళ్ల భరణి, ప్రియదర్శి తదితరులు .గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నాగబాబు ఇలా అందరూ వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
రాజకీయ నాయకులు చేసే అవినీతి, డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, వేలమంది గ్రాడ్యుయేట్స్కు ఉద్యోగాలు వంటి విషయాలను సినిమాలో చూపించారు దర్శకుడు. మానసిక సంఘర్షణ అనే అంశం చుట్టూ అల్లుకుంటూనే నేటి రాజకీయ పరిస్థితులకు లింకు పెడుతూ దర్శకుడు గోపి గణేష్ పట్టాభి కథను రాసుకున్నాడు. ఇలాంటి కథలతో శంకర్ సహా కొంత మంది దర్శకులు సినిమాలను తెరకెక్కించారు. మరి అలాంటి మార్పు వచ్చిందా.. వస్తుందా! సినిమా అనే బలమైన మాధ్యమం ద్వారా ఈ ప్రశ్నలను సంధించారు డైరెక్టర్ గోపి గణేష్ పట్టాభి. శాండీ అద్దంకి, సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం బావుంది. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.
విశ్లేషణ:
మన వ్యవస్థలోని లోపాలను అడ్డు పెట్టుకుని కొందరు రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు. అలాంటి అవినీతి రాజకీయాల కారణంగా ప్రావీణ్యత, సామర్థ్యం ఉన్న యువతకు ప్రాధాన్యత తగ్గిపోతుంది. కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి చదువుకున్న యువతీ యువకులకు తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండటం లేదు. చదివిన చదువు ఒకటైతే చేసేసంబంధం లేని పనులు చేస్తున్నారు.. మన దేశంలో ఉద్యోగ కల్పనకు ఎన్నో కంపెనీలు ఆసక్తి చూపుతున్నా కూడా రాజకీయ నాయకులు కొందరు వారి స్వ ప్రయోజనాలతో ఆలోచిస్తున్నారు. సినిమా కాన్సెప్ట్ నిజానికి బాగుంది. కానీ ఆ కథను వెండితెరపై ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయినట్లే అని చెప్పుకోవచ్చు. కిడ్నాప్ ఎందుకు చేశారో చెప్పేది కొంతవరకు బాగున్నా తర్వాత ఆసక్తిగా ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. అంతా ఎక్స్పెక్టెడ్ సీన్లతో బోరింగ్గా ఉంటుంది. ఫ్లాష్బ్యాక్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అంతగా కనెక్ట్ కాలేదనే చెప్పొచ్చు. కానీ చివరిలో వచ్చే క్లైమాక్స్ మాత్రం సినిమాకు హైలెట్గా నిలిచింది. చివరిగా చెప్పాలంటే మరోసారి వృథా అయిన సత్యదేవ్ యాక్టింగ్ కోసం తప్పకుండా చూడొచ్చు.