కవిత ఈడీ కస్టడీ మరో 3 రోజులు పొడిగించిన కోర్టు
ఢిల్లీ మద్యం స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే. కవిత అరెస్టైన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆమెను వారం రోజుల క్రితం అరెస్ట్ చేసింది. స్పెషల్ కోర్టు ఆమెకు 6 రోజుల రిమాండ్ విధించి ఈడీకి అప్పగించింది. తాజాగా 6 రోజుల కస్టడీ పూర్తి కావడంతో ఈడీ తిరిగి కవితను రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి కస్టడీ పొడిగించాలని కోరింది. కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ న్యాయవాది కోర్టుకు వివరిస్తూ.. కవిత కుటుంబసభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని, మరికొందరితో కలిపి ఆమెను ప్రశ్నించాల్సి ఉందని, అందువల్ల కనీసం మరో 5 రోజులు ఆమెను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు.
దీనిపై విచారించిన కోర్టు.. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం ఈడీ వాదనలతో ఏకీభవించింది. అయితే ఈడీ కోరినట్లు 5 రోజులు కాకుండా 3 రోజుల పాటు కవిత కస్టడీని పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఈ నెల 26 వరకు కవిత ఈడీ కస్టడీలో కొనసాగనున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవిత కోర్టులోకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. తన అరెస్టు అక్రమమని, న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మరోవైపు కవిత తరఫు న్యాయవాది సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరారు.