హుజూరాబాద్లో ఆడిన నాటకాలు.. ఇక్కడ సాగనివ్వం : ఈటల
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరగానే రాష్ట్ర నాయకత్వమంతా మునుగోడులో మోహరిస్తామని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్లో ఆడిన నాటకాలు ఇక్కడ సాగనివ్వమని హెచ్చరించారు. రాజగోపాల్ రాజీనామా చేస్తానంటే మునుగోడు ప్రజలు సంబరపడుతున్నారని, ఉప ఎన్నిక వస్తే సమస్యలు తీరుతాయని భావిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య ఉండదు. సీఎం కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి నాకు చిరకాల మిత్రుడు. పార్టీలు వేరైనా మాతో కలిసి తెలంగాణ ఉద్యమంలో అన్యాయంపై పోరాడిన వ్యక్తి. రేవంత్ రెడ్డి తన బ్లాక్మెయిల్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లతో మాట్లాడే స్థాయి కాదు నాది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా ప్రకటించగానే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణం. ఇలా ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజాస్వామ్యంలో చులకన అవుతారు. మమ్మల్ని తిట్టడం మానేసి కేసీఆర్తో కొట్లాడాలి. ప్రధాని మోదీ పరిపాలన చూసి ఇతర పార్టీల నేతలు బీజేపీలోకి వస్తున్నారు అని ఈటల అన్నారు.