వెంకీ- దుల్కర్ మరో సీతారామం అవుతుందా?
టాలీవుడ్ లో ఎంతో మంది మలయాళ హీరోయిన్లు సక్సెస్ అయ్యారు కానీ మలయాళ హీరో వచ్చి టాలీవుడ్లో సినిమా చేసి మన హీరో అనిపించుకున్నవారు చాలా అరుదు. ఈ ఛాన్స్ దుల్కర్ సల్మాన్ అందుకున్నాడు. ఓకే బంగారం సినిమాతో తొలిసారి టాలీవుడ్ కు పరిచయమైన అతను, తర్వాత మహానటి సినిమాతో జెమినీ గణేషన్గా మెప్పించాడు.
ఇక రీసెంట్గా సీతారామం సినిమాతో రామ్ పాత్రలో ఒదిగిపోయి, పక్కింటి కుర్రాడనిపించుకున్నాడు తెలుగు ప్రేక్షకులతో. ఇంకా చెప్పాలంటే సీతారామం తర్వాత దుల్కర్ని ఇష్టపడని వాళ్లు ఎవరూ లేరని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత దుల్కర్ కు తెలుగులో చాలానే అవకాశాలొచ్చాయి కానీ దుల్కర్ మాత్రం ఛాన్సులొచ్చాయని తొందరపడకుండా ఆలోచించి కాస్త లేటయినా మంచి సినిమానే చేయాలని వెయిట్ చేశాడు.
ఫైనల్ గా ఇప్పుడు వెంకీ అట్లూరితో సినిమాకు దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెంకీతో వరుసగా సినిమాలు చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానరే ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మిస్టర్ మజ్ను, రంగ్దే సినిమాలతో వెంకీ నిరాశ పరిచినా, రీసెంట్గా వచ్చిన సార్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ధనుష్ లాంటి స్టార్ హీరోని వెంకీ హ్యాండిల్ చేసిన విధానం అందరికీ బాగా నచ్చింది.
అలాంటి వెంకీ ఈసారి మలయాళ స్టార్ హీరో దుల్కర్కు స్టోరీ చెప్పి ఒప్పించుకున్నాడు. ఈ సినిమా కూడా ఓ ప్రేమ కథా చిత్రమేనని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా మరో సీతారామం అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు హీరోయిన్ ను వెతికే పనిలో ఉంది చిత్ర యూనిట్.