బీఆర్ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థి నివేదిత ఇంటి వద్ద ఉద్రిక్తత..
బీఆర్ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థి నివేదిత ఇంటిదగ్గర డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గతంలో తమకు ఇల్లు ఇప్పిస్తాము అంటూ దివంగత ఎమ్మెల్యే సాయన్న కోట్ల రూపాయలు తమ దగ్గర వసూలు చేసి మోసం చేశారంటూ మారేడుపల్లెలోని నివేదిత నివాసం వద్ద ఆందోళన చేపట్టిన లబ్ధిదారులు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలి అంటూ అక్కడే బయటాయించడంతో పాటు సాయన్నకు, నివేదితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో నివేదిత తన ఇంటి వద్ద లేరు. ఎన్నికల ప్రచారం కోసం ఆమె బయటకు వెళ్లిన సమయంలో ఆందోళన చోటు చేసుకుంది. నిరసనకు దిగిన వారిలో ఒకప్పటి సాయన్న అనుచరులు కూడా ఉన్నారు. రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత, మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. కెసిఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ కు చెందిన లబ్ధిదారులు అతని ఫామ్ హౌస్ వద్ద ఆందోళనకు దిగారు. సాయన్న, నివేదిత లబ్ధిదారుల నుంచి సుమారు 1.46 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారని.. బీఆర్ఎస్ నాయకుడు సదానందగౌడ్ ఆరోపించారు. ఇల్లు ఇప్పిస్తామని ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఆందోళనకు దిగిన వారు పేర్కొన్నారు. ఇల్లు ఇప్పించలేక పోవడంతో డబ్బులు వెనక్కి ఇవ్వవలసిందిగా గత సంవత్సరం డిమాండ్ చేయడంతో 12 లక్షల రూపాయలు వాపసు ఇచ్చారని.. ఇంకా 1.34 కోట్లు ఇవ్వాల్సి ఉందని బాధితులు పేర్కొన్నారు.