సెకండ్ హోంలకు పెరిగిన డిమాండ్
హైదరాబాద్లో సెకండ్హోంలను కొనుగోలు చేయడానికి చాలామంది మోజు చూపుతున్నట్లు నైట్ ఫ్రాంక్ నిర్వహించిన సర్వేలో తేలింది. 80 శాతం మంది తమ ఇంటి విలువ వచ్చే 12 నెలల్లో 10-19 శాతానికి పై చిలుకు పెరుగుతుందని విశ్వసిస్తున్నారని, దీంతో ధర పెరుగుతుందన్న అంచనాలతో మధ్య సెకండ్ హోం కొనడానికి సుమారు 55 శాతం మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాదీలు భవిష్యత్లో రెండో ఇల్లు కొనుగోలు చేయాలన్న ఆసక్తి పెరగడానికి కీలక అంశాలు బయటపడ్డాయి. కుటుంబ పరిమాణం పెరిగితే భవిష్యత్లో మరో ఇల్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని 43 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఉన్న ఇంట్లో వసతులు పెంచుకోవాలన్న ప్రతిపాదన కీలకం అని 22 శాతం మంది పేర్కొన్నారు. 12 శాతం మంది హాలీడే హోం కావాలనుకుంటే రెండో ఇల్లు కొనడానికి ముందుకు వెళతామన్నారు. మరోవైపు భారీ గ్రీనరీ స్పేస్ ఉన్న ఇండ్ల కొనుగోళ్లకు తాము ప్రాధాన్యం ఇస్తున్నట్లు 97 శాతం మంది భాగ్యనగర వాసులు తెలిపారు. తమ ఇండ్లకు మంచి ఆరోగ్య పరిరక్షణ వసతులు అందుబాటులో ఉండేలా 91 శాతం, 78 శాతం మంది ఆఫీసులకు సమీపాన కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతామని వ్యాఖ్యానించారు.
మధ్యతరగతి ఇళ్ళకు గిరాకీ
హైదరాబాద్తోపాటు పుణె, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో 2020 ద్వితీయార్థంతో పోలిస్తే 2021 జనవరి- జూన్ మధ్య ఇండ్ల కొనుగోళ్లకు డిమాండ్ పెరిగింది. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాల వారి నుంచి సొంతిండ్ల కోసం డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ప్రథమ శ్రేణి నగరాల్లో రూ.36 లక్షల్లోపు, ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో రూ.26 లక్షల్లోపు విలువ గల ఇండ్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపారు. వాటి కొనుగోలుకు అవసరమైన రుణాల కోసం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సంప్రదించారని మ్యాజిక్ బ్రిక్స్ హోంలోన్ కన్జూమర్ సర్వే నిర్ధారించింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, పుణె నగరాల్లో గిరాకీ ఉంది. ద్వితీయ శ్రేణి నగరాలైన గుర్గావ్, జంషెడ్పూర్, పాట్నా, ఫరీదాబాద్, లక్నో నగరాల్లో ఎక్కువగా ఇండ్ల రుణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.