జైలు నుంచే పరిపాలన మొదలుపెట్టిన కేజ్రీవాల్, తొలి ఆదేశాలు జారీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన మొదలుపెట్టేశారు. తొలి ఆదేశాలు కూడా జారీ చేసేశారు. గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టైన నాటి నుంచి ఆయన ఢిల్లీ సీఎంగా కొనసాగుతారా..? లేదా..? అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆప్ నేతలు మాత్రం కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆయన జైలు నుంచే పరిపాలన చేస్తారని చెప్పుకొస్తున్నారు. దానికి తోడు జైలుకు వెళ్లిన తర్వాత కూడా కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామాను సమర్పించకపోవడంతో.. తర్వాత ఏం జరగబోతోందని అంతా ఆత్రుతగా ఎదురు చూడసాగారు.
ఈ క్రమంలోనే నేడు ఆదివారం కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన మొదలుపెట్టేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆప్ అధికారిక ప్రకటన మేరకు.. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ నేడు తొలిసారి ఢిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో ఆదేశాలు జారీ చేశారు. దీనిని ఓ నోట్ రూపంలో జలమంత్రిత్వశాఖను నిర్వహిస్తున్న ఆతిశీ మార్లీనాకు ఆయన పంపించడం జరిగింది. దీనిపై ఆప్ వర్గాలు స్పందిస్తూ.. ‘‘మేము ముందే చెప్పాం. జైలు నుంచే కేజ్రీవాల్ ప్రభుత్వ పాలన కొనసాగిస్తారని... ఆయనను ఏ చట్టమూ అడ్డుకోలేదు. ఆయన పై ఆరోపణలు రుజువుకాలేదు కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగుతారు’’ అని మంత్రి ఆతిశీ వెల్లడించారు.
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ జైలు నుంచి పాలన కొనసాగించడంపై సీనియర్ బ్యూరోక్రాట్, ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఉమేశ్ సైగల్ మాట్లాడుతూ.. జైలు మాన్యువల్ ఒక వ్యక్తి కారాగారం లోపలి నుంచి ప్రభుత్వాన్ని నడపడానికి అనుమతించదని, ఒకవేళ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటిస్తే ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సీఎంగా ప్రభుత్వాన్ని నడపొచ్చని చెప్పుకొచ్చారు.