ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే.. ఏపీలో : రాజ్నాథ్ సింగ్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్రం సహకరిస్తుంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మాత్రం లెక్కకు మించి అప్పులు చేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. విశాఖలో మేధావులతో జరిగిన సమావేశంలో ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి భరత్, ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజులతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కూడా వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. వైసీపీ ప్రభుత్వం మొత్తం రూ.13.50 లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ.2 లక్షల రుణభారం మోపింది. ఖాజానా ఖాళీ చేసి పన్నుల భారం ప్రజల మీద వేసింది. రాష్ట్రాన్ని, విశాఖను డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్గా మార్చింది. ల్యాండ్, హ్యూమన్ ట్రాఫికింగ్, మైనింగ్ మాఫీయాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో పూర్తిగా కూరుకుపోయిది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధికి భరోసా కల్పిస్తుంది. కాంగ్రెస్ విస్మరించిన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి తెలుగువారిపై ఉన్న గౌరవాన్ని ఎన్డీయే ప్రభుత్వం చాటి చెప్పింది. వచ్చే ఐదేళ్లలో దేశంలో జమిలి ఎన్నికలకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడతాం అని తెలిపారు.