అమ్మ మరణించినా బెయిల్ ఇవ్వలేదు : రక్షణ మంత్రి రాజ్నాథ్
బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న ‘నియంత పాలన’ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ఎమర్జెన్సీ సమయంలో తన తల్లి మరణించినప్పుడు కూడా బెయిల్ ఇవ్వకుండా తననకు కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లోనే ఉంచి వేధించిందని వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో 1975 ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేసుకున్న ఆయన.. నియంతలా ప్రవర్తించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, అలాంటిది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని నియంత సర్కార్ అంటూ ఆ పార్టీ నిందించడం హాస్యాస్పదం అని అన్నారు.
“ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం నాకు పెరోల్ ఇవ్వలేదు. బ్రెయిన్ హ్యామరేజ్తో 27 రోజుల పాటు ఆసుపత్రిలోనే నరకం అనుభవించిన నా తల్లిని చివరి రోజుల్లో కలిసేందుకు కూడా అనుమతివ్వలేదు. కనీసం ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకూ అనుమతించలేదు” అంటూ గద్గద స్వరంతో ఆ నాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు రాజ్నాథ్ సింగ్. అంతేకాకుండా.. ఆనాడు తల్లి ఆఖరి చూపు కూడా తనకు దక్కనివ్వకుండా నియంతృత్వ ధోరణితో వ్యవహరించిన కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీని నియంత సర్కార్ అంటూ విమర్శలు గుప్పిస్తోందని, ఇంతకంటే హాస్యాస్పదమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా అని రాజ్నాథ్ ప్రశ్నించారు.