తెలంగాణలో రియల్ ఎస్టేట్ ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వ విధానాలు, అమలుచేసిన సంస్కరణలే రాష్ట్రంలో పారిశ్రామికవృద్ధికి, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి దోహదపడ్డాయని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి టీ హరీశ్రావు అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో క్రెడాయ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన క్రెడాయ్ రియల్టీ అవార్డ్స్ ఫర్ తెలంగాణ-2021 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలాగే క్రెడాయ్ కూడా వృద్ధి పొందుతున్నదని తెలిపారు. హైదరాబాద్ నగరంలోనే కాకుండా జిల్లాల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగుతున్నదని చెప్పారు. ఇండీడ్ అనే సంస్థ జరిపిన సర్వేలో దేశంలో ఎక్కడ పనిచేసేందుకు ఇష్టపడుతారని అడిగితే హైదరాబాదే తమ ప్రాధాన్యమని మెజారిటీ యువ ఉద్యోగులు సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. దేశంలోనే హైదరాబాద్, తెలంగాణ బెస్ట్గా నిలిచిందని వివరించారు. సివిల్స్ ఉద్యోగులు రిటైర్ అయ్యాక కూడా ఇక్కడే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా పరిశ్రమ కష్టకాలం ఎదుర్కొన్నదని, అలాంటి తరుణంలోనూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్రంగం దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగిం దని గుర్తుచేశారు. హైదరాబాద్ విశ్వనగరంగా ప్రపంచ పటంలో నిలబడిరదని చెప్పారు. నగరం చుట్టూ భూములు బంగారు సిరులు ఒలికిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన 2014-15లో తలసరి ఆదాయం.. రూ.1,24,104 కోట్లు ఉంటే, 2020-21 నాటికి రూ.2,37,632 కోట్లకు పెంచగలిగామని తెలిపారు. దేశ తలసరి ఆదాయం రూ.1,28,829 కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో విద్యుత్తు వినియోగంలోనూ తెలంగాణ నంబర్వన్ స్థానంలో నిలిచిందని వెల్లడిరచారు. ఐటీ రంగంలో అద్భుత వృద్ధి నమోదుచేసిందని, ప్రత్యేకంగా, పరోక్షంగా 20 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని వివరించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు శేఖర్రెడ్డి, ఉపాధ్యక్షులు అజయ్కుమార్, మధుసూదన్రెడ్డి, జగన్మోహన్, పాండురంగారెడ్డి, కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, కోశాధికారి ఎన్ ప్రశాంత్రావు, ప్రేమ్సాగర్రెడ్డి పాల్గొన్నారు.
జూపల్లికి క్రెడాయ్ లైఫ్టైం ఆచీవ్మెంట్ అవార్డ్
క్రెడాయ్-తెలంగాణవారు మైహోం గ్రూపు చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావుకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ద్వారా లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. 35 ఏండ్లుగా నిర్మాణ రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలకుఈ అవార్డును క్రెడాయ్-తెలంగాణ ప్రకటించింది. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన టీఎస్ కాన్క్లేవ్లో అవార్డును ప్రదానంచేశారు. ఈ సందర్భంగా రామేశ్వర్రావు మాట్లాడుతూ.. నాణ్యమైన నిర్మాణాలతో, కచ్చితమైన సమయానికి డెలివరీ చేస్తే వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనవచ్చునని చెప్పారు. తాను గత మూడేండ్లుగా ముచ్చింతల్లో నెలకొల్పనున్న సమతామూర్తి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ప్రాజెక్టుపై ఎక్కువగా పనిచేస్తున్నానని, ఫిబ్రవరిలో నిర్వహించనున్న ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.