అసలు కాంగ్రెస్ కు ఎందుకు అంత భయం? : మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన చొరబాటుదారు వ్యాఖ్యలు బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ప్రధాని తాజాగా హస్తం పార్టీపై మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ కుట్ర పన్నుతోందనే సత్యాన్ని తాను బయటపెట్టడంతో ఆ పార్టీలో ఆందోళన మొదలైందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. ఇటీవల రాజస్థాన్ వచ్చినప్పుడు కొన్ని సత్యాలను 90 సెకన్లలో దేశానికి తెలియజేశా. నా ప్రసంగానికి కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలో భయాందోళనలు మొదలయ్యాయి. ప్రజల ఆస్తులను లాక్కొని వాటిని కొందరు వ్యక్తుల (చొరబాటుదారులను ఉద్దేశిస్తూ) కు పంపిణీ చేసేందుకు కుట్ర పన్నుతోంది. వారి ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలను బయటపెట్టా. అసలు కాంగ్రెస్కు ఎందుకు అంత భయం? అని ప్రశ్నించారు. ఒకవేళ 2014 నుంచి కేంద్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉంటే దేశ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించాలన్నారు.