మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. కనీసం డిపాజిటును కూడా దక్కించుకోలేకపోయింది. 15 రౌండ్లలో ఏ ఒక్క రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించలేదు. మొదటి నుంచి చివరి రౌండ్ వరకు మూడో స్థానంలో ఉండిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి ఉదయం 10 గంటల సమయంలోనే వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత కౌంటింగ్ వైపు కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెత్తి కూడా చూడలేదు. డిపాజిట్ కూడా కోల్పోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
మునుగోడు ఉప ఎన్నికలో 2,41,805 ఓట్లకు గానూ మొత్తం 2,25,192 కోట్లు పోలయ్యాయి. పోలై చెల్లుబాటైన ఓట్లలో 1/6 వంతు వస్తే డిపాజిట్ దక్కినట్లుగా ప్రకటిస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ కోల్పోయినట్లు. పాల్వాయి స్రవంతి డిపాజిట్ దక్కించుకోవాలంటే 37,532 ఓట్లు రావాలి. కానీ అన్ని ఓట్లు రాలేదు. కేవలం 21 వేల పైచిలుక ఓట్లే స్రవంతికి పోలయ్యాయి.