పీవోకే భారత్లో విలీనమవుతుంది: రక్షణమంత్రి రాజ్నాథ్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ త్వరలో భారత్లో విలీనమవుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అక్కడి ప్రజలే ఇప్పుడు భారత్లో విలీనం కావాలని డిమాండ్లు చేస్తున్నారని, అతి త్వరలోనే వారి కోరిక, భారత్ చిరకాల కల నెరవేరుతుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హోలీ సందర్భంగా లద్దాఖ్లోని లేహ్ సైనిక స్థావరాన్ని రాజ్నాథ్ సింగ్ ఆదివారం సందర్శించారు. అక్కడ సైనికులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కశ్మీర్పై పాక్ ప్రధాని ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి మీడియా ఆయనను ప్రశ్నించింది. దీనికి సమాధానంగా పీవోకే ప్రజలు భారత్లో విలీనం అవుతారనే విశ్వాసం తనకుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ‘కశ్మీర్ను పాకిస్తాన్ స్వాధీనం చేసుకోగలదా? పీఓకే గురించి వాళ్లు ఆందోళనపడాలి. అక్కడ దాడి చేసి ఆక్రమించుకోవాల్సిన అవసరమై మనకు లేదు. ఈ విషయం ఏడాదిన్నర క్రితమే చెప్పాను. కారణం అక్కడ పరిస్థితుల్లో మార్పు వస్తోంది. భారత్లో విలీనం కావాలని పీవోకే ప్రజలే స్వయంగా డిమాండ్ చేస్తున్నారు.’ అని ఆయన అన్నారు.
కాగా.. పీవోకేకు సంబంధించి ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల గురించి ప్రశ్నించగా.. ‘పీఓకే భారత్ది. గతంలో, ఇప్పుడూ, ఎప్పుడూ అది మనదే. అందుకే పీఓకే కచ్చితంగా భారత్లో విలీనమవుతుందనే విశ్వాసం ఉంది. ఇంతకంటే చెప్పలేను. చెప్పకూడదు. కానీ ఒక్కడి మాత్రం చెబుతున్నా.. మనం ఏ దేశంపైనా దాడికి దిగం. ప్రపంచంలో ఏ దేశంపైనా దాడి చేసి ఆ దేశాలకు చెందిన అంగుళం భూమి కూడా ఆక్రమించుకున్న చరిత్ర భారత్కు లేదు. అది మన లక్షణం కూడా కాదు’’ అని రాజ్నాథ్ పేర్కొన్నారు. అనంతరం జవాన్లతో ముచ్చటించిన ఆయన.. హోలీ పండుగ కోసం ఇక్కడికి రావడం తన జీవితంలోని అత్యంత సంతోషకరమైన క్షణాల్లో ఒకటంటూ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఢిల్లీ మన దేశ రాజధాని అని, ముంబయి మన ఆర్థిక రాజధాని అని.. అలాగే లద్దాఖ్ మన శౌర్యానికి రాజధాని అని సైనికుల్లో ధైర్యం నింపారు