ఆదివాసీ, బంజారా భవనాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ బంజారాహిల్స్లో నిర్మించిన బంజారా, ఆదివాసీ భవనాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆదివాసీ, గిరిజన తెగల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం వారి ఆత్మగౌరవ ప్రతీకలుగా బంజారాహిల్స్లో రోడ్ నెంబర్ 10లో కుమ్రం భీమ్ ఆదివాసీ, సంత్ సేవాలాల్ బంజారా భవనాలను నిర్మించింది. వీటి నిర్మాణం కోసం దాదాపు రూ.50 కోట్ల నిధులను ఖర్చుచేసింది. జీ ప్లస్ వన్ విధానంలో నిర్మించిన ఈ భవనాల్లో వేర్వేరుగా 1000 మంది కూర్చొనేలా ఆడిటోరియం, 250 మందికి సరిపోయే డైనింగ్ హాల్స్, వీఐపీ లాంజ్లు, ఫొటోగ్రఫీ, కళాకృతులు, పెయింటింగ్స్ వంటి ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని గోండు, కోయ, పర్దాన్, థోటి, నాయక్పోడ్, చెంచు ఇలా 10 ఆదివాసీ తెగల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ భవనాలు రూపుదిద్దుకున్నాయి. బంజారా భవన్లో లంబాడీల జీవన విధానం, సంస్కృతిని తెలిపే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు.