హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మార్పులు
లగ్జరీ ఇళ్ళపైనే మోజు
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఇళ్ళను కొనుగోలు చేసేవాళ్ళలో వచ్చిన మార్పులతో లగ్జరీ ఇళ్ళ నిర్మాణాలకు డిమాండ్ బాగా పెరిగింది. గతంలో లాగా ఏదో ఒక ఇంటిని కొనాలన్న ఆలోచన నుంచి నగరానికి కాస్త దూరమైనాసరే విశాలంగా, ప్రశాంత వాతావరణంలో లగ్జరీగా నివాసం ఉండాలని కోరుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఆధునిక సాంకేతిక హంగులు, సౌకర్యాలు, భద్రత వంటి అంశాల్లోనూ రాజీ పడట్లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు నగర శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న గేటెడ్ కమ్యూనిటీలకు ఆదరణ పెరుగుతున్నది. దీంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు వీటికే పెద్దపీట వేస్తున్నాయి. దీంతో హైదరాబాద్ మహానగరం.. లగ్జరీ హౌజింగ్కు కేరాఫ్ అడ్రస్గా మారిపోయిందని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ సంస్థ విడుదల చేసిన తాజా త్రైమాసిక నివేదిక వెల్లడించింది.
హైదరాబాద్ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ తీరుతెన్నులపై అనరాక్ సంస్థ ఇచ్చిన రిపోర్టులో లగ్జరీ ఇండ్లదే హవా అని తేలగా, హైదరాబాద్ ముందు వరుసలో నిలిచింది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై-ఎంఆర్, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పుణె నగరాలపై తాజా సర్వే జరిగింది. ఈ నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్లో కొత్తగా మార్కెట్లోకి 1,16,220 యూనిట్లు అందుబాటులోకి రాగా.. ఇందులో రూ.40 లక్షలు, అంతకంటే తక్కువ ధర కలిగినవి (సరసమైన ధరల గృహాలు) 20,920గా ఉన్నాయి. ఇది 18 శాతానికి సమానం.
కరోనాకు ముందు గరిష్ఠంగా కొత్త ఇండ్లు నమోదైన 2018 జూలై-సెప్టెంబర్లో మొత్తం 52,120 యూనిట్లకు 21,900 సరసమైన ధరల గృహాలే. ఇది 42 శాతానికి సమానం. 2019 జూలై-సెప్టెంబర్లోనూ 41 శాతంగా ఉన్నట్టు గుర్తుచేసింది. అయితే 2021 ఇదే వ్యవధిలో 24 శాతంగా ఉన్నాయని, ఈ ఏడాది ఇంకా తగ్గాయన్నది. ఫలితంగా కొత్త ఇండ్లు ఈ ఏడాది జూలై-సెప్టెంబర్లో పెరిగినా.. వాటిలో సరసమైన ధరల గృహాల వాటా మాత్రం తగ్గినట్టు అనరాక్ చెప్పింది. ఈ జూలై-సెప్టెంబర్లో అందుబాటు లోకి వచ్చిన కొత్త ఇండ్లలో 31,180 లగ్జరీ యూనిట్లే. మొత్తం ఇండ్లలో ఇది 27 శాతానికి సమానం. 2018 జూలై-సెప్టెంబర్లో 4,590గా ఉన్నాయి. ఇక ఈసారి అత్యధికంగా హైదరాబాద్ నుంచే 14,340 ఉండటం గమనార్హం. 7,830 యూనిట్లతో రెండో స్థానంలో దేశ వాణిజ్య రాజధాని ముంబై నిలిచింది. కాగా, సర్వే సందర్భంగా వినియోగదారుల అభిప్రాయాలనూ అనరాక్ సేకరించింది. ఇందులో 16 శాతం మంది లగ్జరీ హౌజింగ్ ప్రాజెక్టులపట్ల ఆసక్తి కనబర్చారు. కోవిడ్కు ముందు వీరి సంఖ్య 9 శాతంగానే ఉండటం గమనించదగ్గ అంశం. కరోనా మహమ్మారి తర్వాత లగ్జరీ హౌజింగ్కు డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకున్నది.
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో సొంత ఇండ్లను కొనుగోలు చేసేవారు విశాలమైన స్థలంతోపాటు అత్యాధునిక సౌకర్యాలు, మంచి లోకేషన్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రధానంగా రూ.1.5 కోట్ల నుంచి మొదలయ్యే ఇండ్లకు భారీ ఎత్తున డిమాండ్ కనిపిస్తున్నది. దీంతో డెవలపర్లూ వీటి నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నారు. ఇక లగ్జరీ ప్రాజెక్టులు హైదరాబాద్ కేంద్రంగా ఊహించని రీతిలో పెరిగాయి. నిజానికి ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో లగ్జరీ హౌజింగ్ ప్రాజెక్టుల దూకుడు చాలా బాగా పెరిగిపోయింది. ఇదే సమయంలో అందుబాటు ధరల్లో ఉండే ఇండ్లు తగ్గుముఖం పట్టాయి. గత ఐదేండ్లుగా ఇవి క్రమేణా తగ్గుతున్నాయని అనరాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్, రీసెర్చ్ హెడ్ ప్రశాంత్ థాకూర్ తెలిపారు.