ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి : చంద్రబాబు
ప్రజల జీవితాలతో చెలగాటమాడిన జలగ, సైకో జగన్ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంబ్రాబాబు నాయుడు విమర్శించారు. శ్రీకాకుళంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ ప్రభుత్వమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు టీడీపీ పుట్టినిల్లు అని తెలిపారు. తాను మొదటి నుంచి మహిళా పక్షపాతినని తెలిపారు. మీ కుటుంబాలకు పెద్దకొడుకులా సేవ చేస్తానన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఎన్నికలకు నేటి నుంచి 19 రోజులు మాత్రమే ఉంది. మే 13న వైసీపీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలి. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి. అసమర్థ చేతకాని ప్రభుత్వంలో అన్నీ ఇబ్బందులే. సమర్థ ప్రభుత్వం, నాయకత్వం ఉంటేనే మీ జీవితాలు బాగుపడతాయి. మేం అధికారంలోకి వచ్చాక అమ్మకు వందనం కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తాం. ఆడబిడ్డలను లక్షాధికారులను చేయడమే నా లక్ష్యం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచి నీరు సరఫరా చేస్తాం. వడ్డీ లేని రుణాలు అందిస్తాం. స్థలాలు లేని వారికి 2, 3 సెంట్లు భూమి ఇప్పించి గృహాలు నిర్మిస్తామన్నారు.
పెంచిన రూ.4 వేల పింఛన్లను ఏప్రిల్ నుంచే ఇస్తాం. దివ్యాంగులకు రూ.6 వేలు అందిస్తాం. పింఛన్ల పేరుతో ఈ ప్రభుత్వం శవ రాజకీయాలు చేస్తోంది. జగన్ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తాం. సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి కుటుంబ భవిష్యత్తుకు గ్యారంటీ లభిస్తుంది. అప్పులు తెచ్చి బటన్ నొక్కడం గొప్ప కాదు. సంపద సృష్టించే, ఉద్యోగాలు కల్పించే వాళ్లు నాయకులు, ఉత్తరాంధ్ర ద్రోహి జగన్ ఏం చేశారని ఇక్కడికి వస్తున్నారు? ఒక్క ప్రాజెక్టయినా కట్టారా? ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చారా? ఏమీ చేయకుండా ప్రజలకు కథలు చెప్పడానికి వస్తున్నారు అని అన్నారు.