వీనుల విందు.. అమెరికా అబ్బాయి సంగీత అరంగేట్రం
అమెరికా లో పుట్టి పెరిగి అక్కడే ఇంజనీరింగ్ చదువుతున్న అబ్బాయి అలా అలవోకగా అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలను రాగయుక్తంగా ఆలపిస్తూ ఆహా అనిపించాడు. రెండు గంటల పాటు వివిధ రాగాల్లో కీర్తనలను పాడి భక్తి సంద్రం లో ముంచెత్తాడు. ఆదివారం చిక్కడపల్లి ఆర్టీసీ కల్యాణ మండపం లో మాధవ్ దంతుర్తి కర్నాటక సంగీత గాత్ర కచేరి అరంగేట్రం వీనుల విందుగా సాగింది. ప్రముఖ సంగీత విద్వాంసులు, తిరుపతి జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం లో భారతీయ సంగీత విభాగం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం దగ్గర అమెరికా లో ఉండి ఆన్ లైన్ లో సంగీత శిక్షణ పొందిన మాధవ్ దంతుర్తి చేసిన తొలి సంగీత ప్రదర్శన కు విశేష స్పందన లభించింది.
అభోగి రాగం లో మహా గణపతి ని స్తుతిస్తూ తన కచేరి ని ప్రారంభించిన మాధవ్ అనంతరం అంబావాణి, ఎంత నేర్చిన, జో జో రామా తదితర క్లిష్టమైన కీర్తనలను రాగ రంజితం గా ఆలపించి అభినందనలు అందుకున్నారు. పాడుతా తీయగా ఫేమ్ గా ఇప్పటికే అమెరికా లో గుర్తింపు పొందిన మాధవ్ కాలిఫోర్నియా లో ఒకవైపు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతూ ఎంతో పట్టుదలతో సంగీతం నేర్చుకున్నారని గురు వైజర్సు బాల సుబ్రహ్మణ్యం ప్రశంశించారు. సంగీతం తో క్రమశిక్షణ వ్యక్తిత్వ వికాసం చేకూరుతుందని, తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన అన్నారు. వయోలిన్ తో ఓ. రాజశేఖర్, మృదంగం తో సి. హెచ్. రామకృష్ణ, మోర్సింగ్ తో డాక్టర్ శ్రీకాంత్ వాద్య సహకారం అందించి రక్తి కట్టించారు. మాధవ్ తన తల్లిదండ్రులు విజయ భాను, వీరభద్రం దంతుర్తి తో కలసి డాక్టర్ వైజర్సు బాల సుబ్రహ్మణ్యం ను ఘనంగా సత్కరించి గురు భక్తిని చాటు కున్నారు. సంగీత దర్శకుడు రామాచారి కోమండూరి పాల్గొని మాధవ్ కు ఆశీస్సులు అందించారు.
- డాక్టర్ మహ్మద్ రఫీ