రాహుల్ గాంధీ ప్రత్యర్థి సురేంద్రన్...?
కేరళలోని వయనాడ్ పార్లమెంటరీస్థానం.. కాంగ్రెస్ కంచుకోట. 2009 నుంచి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులే విజయబావుటా ఎగురవేస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన అభ్యర్థుల నామమాత్రం పోటీ ఇస్తూ వచ్చారు. అలాంటి చోట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నారు.2019లో ఇక్కడి నుంచి పోటీ చేసిన రాహుల్.. ఘన విజయం సాధించారు.అయితే ఈసారి ఇక్కడి నుంచి రాహుల్ పై .. బీజేపీ తరపున సురేంద్రన్ పోటీలో ఉన్నారు.
2024 ఎన్నికల్లో రాహుల్ కి పోటీగా బీజేపీ ఎవరిని నిలుపుతుందనే దానిపై సందిగ్ధత వీడింది. కేరళ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె.సురేంద్రన్ వయనాడ్ నుంచి రాహుల్తో పోటీ పడనున్నారు. ఈసారి కూడా అక్కడ త్రిముఖ పోరు ఉండనుంది. దక్షిణాదిలో కాంగ్రెస్, వామపక్షాలు ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ ఇండియా కూటమిలో సభ్యులుగా ఉన్నారు. 2020లో సురేంద్రన్ బీజేపీ కేరళ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో పత్తనంతిట్ట నియోజకవర్గం నుంచి సురేంద్రన్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్, కమ్యూనిస్టుల తర్వాత మూడో స్థానంలో నిలిచారు.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో మంజేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సురేంద్రన్ కేవలం 89 ఓట్లతో ఓడిపోయారు. 2020లో కేరళ బీజేపీ చీఫ్ గా ఆయన నియమితులయ్యారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా పోరాడిన ఆయన... ప్రజలకు బాగా దగ్గరయ్యారు. ఈ పోరాటం ద్వారా ఆయన పాప్యులారిటీ కేరళలో బాగా పెరిగింది. దక్షిణాదిలో బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ... రాహుల్ పై ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని బరిలోకి దింపింది. కేరళలో వామపక్ష పార్టీలు బలంగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ - వామపక్షాలు ఒకే కూటమిలో ఉన్నప్పటికీ... కేరళలో మాత్రం విడివిడిగానే పోటీ చేస్తున్నాయి.