యాపిల్ కు బైడెన్ ప్రభుత్వం షాక్ ... నిషేధం అమల్లోకి!
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీకి చెందిన రెండు స్మార్ట్ వాచ్ లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు బైడెన్ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆ వాచ్ల విక్రయాలపై నిషేధం అమల్లోకి వచ్చింది. అమెరికాలో న్యూ ఇయర్ హాలీడే వేళ ఈ నిషేధం పడటంతో యాపిల్ భారీగా నష్టపోయే అవకాశముంది. యాపిల్ ఇటీవల విడుదల చేసిన సిరీస్ 9, అల్ట్రా 2 వాచ్లకు పేటెంట్ సమస్య ఎదురైంది. వీటిల్లోని బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలను కొలిచే ఫీచర్ విషయంలో తమ పేటెంట్ను యాపిల్ ఉల్లంఘించిందంటూ మాసిమో కార్పొరేషన్, మరో కంపెనీ దావా వేశాయి. దీంతో ఈ రెండు మోడళ్లపై ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ అక్టోబరులో నిషేధం విధించింది. అయితే, దీనిని పున సమీక్షించేందుకు 60 రోజుల గడువు విధించింది.
ఈ నిషేధాన్ని తొలగించేలా అధ్యక్షుడు జో బైడెన్కు వీటో అధికారం ఉంది. కానీ, యాపిల్ విషయంలో జోక్యం చేసుకునేందుకు వైట్హౌస్ తాజాగా నిరాకరించింది. ఈ వాచ్ మోడళ్లపై నిషేధం విధిస్తూ ఐటీసీ తీసుకున్న నిర్ణయంలో యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కేథిరన్ తాయ్ ఎలాంటి మార్పులు చేయలేదని అధికారులు వెల్లడించారు. దీంతో వీటి విక్రయాలపై డిసెంబరు 26 నుంచి నిషేదాజ్ఞలు అధికారికంగా అమల్లోకి వచ్చినట్లయ్యింది.