కేంద్రం కీలక నిర్ణయం.. కిలో రూ.25కే!
దేశంలో నానాటికి పెరిగిపోతున్న బియ్యం ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో భారత్ రైస్ పేరుతో కిలో బియ్యాన్ని రూ.25కే విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో సగటున కిలో బియ్యం ధర క్రితం ఏడాదితో పోలిస్తే 14.1 శాతం పెరిగింది. దీంతో అందుబాటు ధరలో బియ్యాన్ని అందించేందుకు కేంద్రం భారత్ రైస్ను తీసుకురానున్నట్లు సమాచారం. నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్, మొబైల్ వ్యాన్ల ద్వారా రాయితీ ధరకు బియ్యం విక్రయాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ బ్రాండ్ కింద రూ.60కే కిలో శనగపప్పు, రూ.27.50కే కిలో గోధమ పిండిని విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్, నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా దేశంలోనే 2 వేల రిటైల్ పాయింట్లలో వీటిని విక్రయిస్తున్నారు. వీటిలాగే భారత్ రైస్ విక్రయాలు కూడా చేపట్టనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.